2022లో మొదటి రోజే తీవ్ర విషాద ఘటన జరిగింది.. జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతిచెందారు.. ఈ తొక్కిసలాటలో మరో 13 మంది భక్తులు గాయపడినట్టుగా చెబుతున్నారు.. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని కత్రాలోని మాతా వైష్ణో దేవి మందిరంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 2.45 గంటలకు ఘటన చోటు చేసుకుంది.. ఒకరినొకరు తోసుకోవడంతో ప్రారంభమై.. చివరకు తీవ్ర తొక్కిసలాట జరిగిందని జమ్మూ అండ్ కాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు..
Read Also: తెలంగాణలో మద్యం అమ్మకాలు.. సరి కొత్త రికార్డు..
ఈ ప్రమాదంపై ఓ ప్రకటన విడుదల చేసిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గోపాల్ దత్… మృతుల్లో ఎక్కువ మంది ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్కు చెందినవారిగా తెలిపారు.. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు.. మిగతా భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ… మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు మరియు గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోడీ.