బండ్లగూడలో విషాదం.. కరెంట్ షాక్తో ధోనీ మృతి!
చాంద్రాయణగుట్ట బండ్లగూడలో విషాదం నెలకొంది. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు వికాస్, ధోనీలు మృతి చెందారు. చాంద్రాయణగుట్ట నుంచి పురానాపూల్కు గణేష్ విగ్రహాన్ని తీసుకొని వెళుతుండగా యువకులకు కరెంట్ షాక్ తగిలింది. ఈ ఘటనలో మరో ముగ్గురు యువకులకు గాయాలు అయ్యాయి. ముగ్గురిలో ఓ యువకుడికి పెద్దగా గాయాలు కాలేదు. గాయపడ్డ ఇద్దరు యువకులను చికిత్స నిమ్మితం చాంద్రాయణగుట్టలోని ఓవైసీ ఆస్పత్రికి తరలించారు. చాంద్రాయణగుట్ట-బండ్లగూడ మెయిన్ రోడ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం రాత్రి రామంతాపూర్లోని గోఖలేనగర్లో 2025 శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి 5 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.
వైట్హౌస్లో ట్రంప్-జెలెన్స్కీ నవ్వులు.. పువ్వులు.. వీడియో వైరల్
వైట్హౌస్ వేదికగా ట్రంప్-జెలెన్స్కీ సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగినట్లు వాతావరణం కనిపిస్తోంది. గత ఫిబ్రవరిలో ట్రంప్-జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం చాలా హాట్హాట్గా సాగింది. ఇరుపక్షాలు వాగ్యుద్ధం చేసుకున్నారు. ఇక మధ్యలోనే జెలెన్స్కీ వైట్హౌస్ నుంచి నిష్క్రమించారు. అప్పట్లో ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అయితే తాజాగా సోమవారం మరొకసారి ట్రంప్-జెలెన్స్కీ సమావేశం అయ్యారు. గత మాదిరిగానే మళ్లీ వాడీవేడిగా సమావేశం జరగొచ్చని అంతా భావించారు. కానీ గత సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ నేతలు, నాటో అధికారులు జెలెన్స్కీ వెంట వచ్చారు. వైట్హౌస్లో ట్రంప్తో జెలెన్స్కీతో పాటు యూరోపియన్ నేతలు కూడా చర్చలు జరిపారు.
పుతిన్-జెలెన్స్కీ భేటీపై ట్రంప్ కీలక ప్రకటన
ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ పట్టుసాధిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు కూడా జరిపింది. కానీ సత్ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగి చర్చలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆగస్టు 15న అలాస్కా వేదికగా పుతిన్తో ట్రంప్ సమావేశం అయ్యారు. 3 గంటల పాటు ఇద్దరి మధ్య చర్చలు నడిచాయి. కానీ యుద్ధం ముగింపుపై ఎలాంటి ప్రకటన రాలేదు. పుతిన్ షరతులు విధించారు. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో సంభాషించారు.
నేడు భారత జట్టు ఎంపిక.. గిల్, శ్రేయస్, సిరాజ్ డౌటే? అవకాశం ఎవరికో!
ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో జరగనుంది. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఆసియా కప్ను టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు. టోర్నీ మొదటి మ్యాచ్ అఫ్గానిస్థాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నేడు 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించనుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోనే భారత్ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైంది. ఆసియా కప్నకు భారత జట్టు ఎంపిక నేడే కాబట్టి ఎవరికి ఛాన్స్ వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీ20ల్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా స్థిరపడ్డారు. దాంతో శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లలో ఒకరికే అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. మూడో ఓపెనర్గా జైస్వాల్ ఎంపికయ్యే అవకాశముంది. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఆడుతారు. రింకు సింగ్ జట్టులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 2025లో పరుగుల వరద పారించిన శ్రేయస్ అయ్యర్ జట్టులో స్థానానికి పోటీ పడుతున్నాడు. కానీ శ్రేయస్ ఇంకొంతకాలం నిరీక్షించక తప్పదేమో. ఆల్రౌండర్లుగా శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్లు ఎంపికవుతారు. రెండో కీపర్గా జితేశ్ శర్మ జట్టులోకి రావొచ్చు.
టీడీపీ నేత కూతురిని పెళ్లాడబోతున్న సింగర్ రాహల్ సిప్లిగంజ్
టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించిన రాహుల్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తోను తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్. ఓ వైవు సినిమా సాంగ్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బిజిగా ఉన్న రాహుల్ తన ఫ్యాన్స్ కు సప్రయిజ్ ఇచ్చాడు. మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సింగర్ గా ఉన్న రాహుల్ ఇప్పుడు సింగిల్ లైఫ్ కు సెండాఫ్ ఇస్తూ ఒకింటి వాడు అయ్యాడు. అయితే రాహుల్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అని ఆరాలు తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. రాహుల్ నిర్మించిన అనేక సాంగ్స్ కు హారణ్య రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అలాగే హారణ్య రెడ్డి రాజకీయ కుటుంబ నేపధ్యం నుండి వచ్చింది. టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురే హారణ్య రెడ్డి. కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్ళికి ఇరు కుటుంబాలు అగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలోఆగస్టు 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని ITC కోహినూర్ హెటల్ లో ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు,చిత్ర, రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాహుల్- హారణ్యల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి టీడీపీ నేతకోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.
సినీ కార్మికుల 16వ రోజు సమ్మె.. నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం..
సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాల పెంపుపై అటు ఫెడరేషన్ నాయకులకు ఇటు నిర్మాతలకు మధ్య ఇటీవల జరిగిన చర్చలు ఫలించలేదు. దాంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ చర్చలు త్వరగా ముంగిచాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం 10గంటలకు ఇందిరా నగర్ లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం కాబోతున్నారు. సర్వసభ్య సమావేశం అనతరం సమస్యలు పరిష్కరించబడాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయనున్నారు సినీ కార్మికులు.
45 కోట్ల విలాస భవంతిని కుక్కల కోసం డొనేట్ చేసిన స్టార్ హీరో !
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్యపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు ఇటీవల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించడం, దాని వల్ల జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేయడం వంటి పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తన పెద్ద మనసును చాటుకున్నారు. తొలి నుంచి జంతు ప్రేమికుడిగా పేరొందిన మిథున్, తనకున్న కుక్కలపై మమకారాన్ని మరింత బలంగా చాటుతూ, 116 కుక్కలను దత్తత తీసుకున్నారు. వాటి కోసం ఆయన ముంబైలోని ఒక ద్వీపంలో ఉన్న తన విలాసవంతమైన 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భవనాన్ని పూర్తిగా కుక్కల కోసం కేటాయించారు. ఈ భవనంలో వాటి కోసం అన్ని రకాల సదుపాయాలు కల్పించడమే కాకుండా, సంరక్షకులను నియమించారు. కుక్కలు ఆడుకునే ప్రదేశాలను, ఆహారం, ఆరోగ్యం, భద్రత కోసం అవసరమైన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు.