కంటివెలుగుతో ప్రపంచరికార్డు సాధించాలి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభించారు. సోమవారం నుంచి పదిరోజుల పాటు సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేక శిబిరాన్ని బి.ఆర్.కె.ఆర్ భవన్లో ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి రోజు సుమారు వంద మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సచివాలయ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు. కంటి వెలుగు కార్యక్రమం అమలుపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ శ్వేతా మొహంతిలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ఇప్పటివరకు క్షేత్ర స్థాయి క్యాంప్ ల నిర్వహణ విజయవంతంగా జరుగుతుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మొదటి రెండు రోజుల్లో 3.87 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, అవసరమైన 97,335 మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అన్ని జిల్లాల్లో ఉన్న బఫర్ టీమ్స్ ఉపయోగించి ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కోర్టు భవన సముదాయాలు, పోలీస్ బెటాలీయన్లు, జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ ల వద్ద ప్రత్యేక కంటి వెలుగు క్యాంప్ లను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
లోకేష్ పాదయాత్రకు భయపడేవాళ్లు లేరు
ఏపీలో పాదయాత్రల రాజకీయం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం హాట్ కామెంట్స్ చేశారు. సాధారణంగా పాదయాత్రకు ముందు రూట్ మ్యాప్ అడగడం సహజం. లోకేష్ తన ఉనికిని కాపాడుకొవడానికి చేసే పాదయాత్ర ఇది అన్నారు. లోకేష్ పాదయాత్ర చూసి భయపడే వాళ్ళు ఎవరూ లేరు. పాదయాత్ర ఎవరైనా చేయొచ్చు. జగన్ పాదయత్రకి ఎన్ని అడ్డంకులు సృష్టించారో మీకు తెలుసు. పాదయాత్ర చేసి ప్రజలు మన్ననలు పొందాలి అని ఉంటే నిబంధనలు పాటించండి.పవన్ కి చంద్రబాబు పార్టీ పగ్గాలు ఎక్కడ అప్పగిస్తారో అని లోకేష్ పాదయాత్ర చేస్తా అంటున్నారు. పాదయాత్ర చేసే హక్కు అందరికీ ఉంది. లోకేష్ ఎమ్మెల్యే కాదు, ప్రతిపక్ష నేత కాదు. లోకేష్ పాదయాత్రకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పాదయాత్రలో ఎవరైనా చనిపోతే ఎవరు బాధ్యత ఇస్తారు.?పోలీసులను అందరినీ గౌరవించాలి. లోకేష్ పాదయాత్ర కామెడీగా మిగిలిపోతుందని ఎద్దేవా చేశారు తలశిల రఘురాం. మరోవైపు నారా లోకేశ్ పాదయాత్రకు ప్రతిబంధకాలు కల్పిస్తే సహించేది లేదని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేస్తామని టీడీపీ నేతలు అంటున్నారు.
ఆ గోడకూల్చిన వ్యవహారం అధికారుల మెడకు చుట్టుకోనుందా?
మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత వివాదం అధికారుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. నీటిపారుదల శాఖ భూమిని ఆక్రమించి నర్సీపట్నం లో అయ్యన్నపాత్రుడు కుమారులు ఇల్లు నిర్మించారనేది కేసు. ఇరిగేషన్ ఫిర్యాదు ఆధారంగా గోడను కూల్చివేసి ఆక్రమణలను తొలగించారు అధికారులు. రాజకీయంగా యూ వ్యవహారం పెద్ద దుమారం రేపింది. కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని హైకోర్టును ఆశ్రయించారు అయ్యాన్న. అప్పట్లో ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ 14మంది అధికారులపై ప్రయివేట్ కేసు దాఖలు చేశారు. అయ్యన్న చిన్న కుమారుడు రాజేష్.నర్సీపట్నం అదనపు సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. కేసు దాఖలు చేసిన తర్వాత అయ్యన్న స్పందించారు. అధికారులపై ఫిర్యాదు చెయ్యడం వెనుక అసలు ఉద్దేశం చెప్పారు. ఒత్తిళ్లకు తలొగ్గి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే కేసు వేసినట్టు చెప్పారు.
తమిళనాడులో కుక్కని కుక్క అనకూడదా?
తమిళనాడులో ఘోరం జరిగింది. కుక్కలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది. కుక్కను కుక్క అని పిలిచినందుకు వృద్ధుడిని కొట్టి చంపారు. సాధారణంగా పెంపుడు కుక్కల విషయంలో బంధువుల మధ్య మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానై ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. దిండిగల్ జిల్లాలోని తాడికొంబులో 65 ఏళ్ల రాయప్పన్ ఉంటున్నాడు. పొరుగింట్లో డేనియల్, విన్సెంట్ ఉంటున్నారు. వీళ్లు బంధువులే. కానీ డేనియల్, విన్సెంట్ పెంచుకుంటున్న కుక్కల విషయంలో రాయప్పన్ తో తరచూ గొడవలు జరుగుతున్నాయి. అటువైపు వెళ్లే వారిపై కుక్కలు దాడి చేస్తున్నాయని రాయప్పన్ పలుమార్లు ఫిర్యాదు చేశాడు. అయితే వాటిని కుక్కలు అనొద్దని, పేర్లు ఉన్నాయని, ఆ పేర్లతో పిలవాలని డేనియల్, విన్సెంట్ చాలా సార్లు చెప్పారు. కానీ రాయప్పన్ పట్టించుకోలేదు. రాయప్పన్ కుక్కలను వాటి పేర్లతో పిలవడానికి నిరాకరించాడు… కుక్కలను పట్టుకొని ఉంచాలని చెప్పడంపై గొడవ మొదలైంది. దీంతో గత గురువారం నాడు మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది.. కుక్కలను కొట్టేందుకు రాయప్పన్ కర్ర తీసుకువచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన విన్సెంట్, డేనియల్.. రాయప్పన్ పై దాడి చేశారు. దెబ్బలకు తాళలేక రాయప్పన్ స్పృహ తప్పిపడిపోయాడు. కొద్ది సేపటికే చనిపోయాడు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. తాడికొంబు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు.
కోటంరెడ్డిని పెట్టి మహానటుడు మూవీ తీయాలి
ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీలోనే నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా స్వంత పార్టీపైన, కొంతమంది వ్యక్తుల పైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వీటిపై కామెంట్ చేశారు. వ్యంగ్యంగా తనదైన రీతిలో విమర్శలు చేశారు. రాజకీయంగా తనను ఎదగనీయకుండాc కుటుంబాల పాలన చేస్తున్నారని చెబుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన తమ్ముడిని కాబోయే ఎమ్మెల్యేగా ఎలా పరిచయం చేశారని అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ రెడ్డి తనకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్నారు. మహానటి సినిమాలా శ్రీధర్ రెడ్డిని పెట్టి మహానటుడు అనే సినిమా తీయాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే చేసే సహాయం ఏముంటుంది…? తట్టలో ఇసుక.. సిమెంట్ మోస్తారా…? లే ఔట్ లో పిచ్చి మొక్కలు పీకుతారా?
అంబేద్కర్ మనవడితో ఉద్దవ్ థాక్రే పొత్తు
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ పార్టీ వంచిత్ బహుజన్ అఘాడీ(వీబీఏ)తో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పొత్తు పెట్టుకుంది. ఈ రెండు పార్టీలు కలిసి వచ్చే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాలాసాహెబ్ ఠాక్రేలకు సమాజంలో దురాచారాలకు వ్యతిరేకంగా నిలబడిన వారసత్వం ఉందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. బాలాసాహెబ్ థాకరే జయంతిని పురస్కరించుకుని శివసేన (యుబిటి), విబిఎ కూటమి మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పును తీసుకువస్తుందని వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. ఈ కలయిక రాజకీయ సమీకరణాలను మార్చేస్తుందని.. కొన్ని పార్టీలు మిత్రపక్షాలను అంతం చేసేలా ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా బీజేపీని విమర్శించారు ప్రకాష్ అంబేద్కర్. రాజకీయ పార్టీల విజయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇంకా షెడ్యూల్ విడుదల కాకపోయినప్పటికీ.. శివసేన ఉద్ధవ్ వర్గం ముంబై ఎన్నికల్లో సత్తా చాలాటాని ప్రయత్నిస్తోంది. శివసేన రెండుగా చీలిపోయిన తర్వాత ఉద్దవ్ వర్గం అధికారాన్ని కోల్పోయింది. ఆ తరువాత వస్తున్న పెద్ద ఎన్నికలు ఇవే కావడంతో గెలుపు కోసం పొత్తులను ఆశ్రయిస్తున్నారు ఉద్ధవ్ ఠాక్రే. ప్రస్తుతం ఈ పొత్తులో ఇద్దరం మాత్రమే ఉన్నామని..కాంగ్రెస్ పొత్తును అంగీకరించలేదని.. శరద్ పవార్ కూడా కూటమిలో చేరుతారని ఆశిస్తున్నట్లు ప్రకాష్ అంబేద్కర్ అన్నారు.
కూకట్ పల్లిలో గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ ఐదుగురు
గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నూక దీపక్, సదురాల నరేష్, బీయ మల్లేష్, , అజయ్, సాయి అనే ఐదుగురు వ్యక్తులు కలిసి విశాఖపట్నంలో గుర్తు తెలియని వ్యక్తి దగ్గర 5 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన గంజాయిని రైలులో సికింద్రాబాద్ కి తీసుకొని వచ్చి అక్కడ ఆర్టీసి బస్సులో కూకట్పల్లి వరకు తీసుకుని వచ్చారు. కూకట్పల్లి బస్ స్టాప్ లో వీరు అనుమానాస్పదంగా కనిపించటంతో, పోలీసులు వీరిని ప్రశ్నించేందుకు ప్రయత్నించగా వారిలో అజయ్, సాయిలు పరారయ్యారు. మిగితా ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న బ్యాగులో చూడగా అందులో ఐదు కిలోల గంజాయి ఉండటంతో, పోలీసులు వారిని అరెస్టు చేసి వారి పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ నర్సింగ్ రావు తెలిపారు.
మార్కెట్లోకి హోండా యాక్టివా హెచ్-స్మార్ట్..ఫీచర్స్ అదుర్స్
భారత్లో టూ వీలర్ సెగ్మెంట్లో యాక్టివాకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. హోండా టూ వీలర్ మోడల్స్లో బెస్ట్ సెల్లింగ్గా దూసుకెళ్తోంది . కస్టమర్ల ఆసక్తి, అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు.. యాక్టివాను అప్డేట్ చేస్తూ వస్తోంది హోండా మోటర్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ). ఈ క్రమంలోనే హోండా యాక్టివా 6జీ లేటెస్ట్ వెర్షన్.. హోండా యాక్టివా హెచ్- స్మార్ట్ను లాంచ్ చేసింది. మొత్తానికి ఈ స్కూటర్లో మూడు వేరియంట్స్ ఉంటాయి. అవి.. స్టాండర్డ్, డీలక్స్, స్మార్ట్. వీటి ఎక్స్షోరూం ధరలు వరుసగా రూ. 74,536- రూ. 77,036- రూ. 80,537. హోండాకు మాత్రమే సొంతమైన ఐదు సరికొత్త టెక్నాలజీ అప్లికేషన్స్ ఈ స్కూటర్లో ఉంటాయని తెలుస్తోంది. ఈ స్కూటర్కు ఓ స్మార్ట్ కీ ఉంటుందని, అది ప్రెస్ చేస్తే.. వెహికిల్ రెస్పాండ్ అయ్యే విధంగా స్మార్ట్ ఫైండ్ ఫీచర్ ఈ యాక్టివా హెచ్- స్మార్ట్లో ఉందని హెచ్ఎంఎస్ఐ చెబుతోంది. ఫిజికల్ కీ లేకుండానే.. స్మార్ట్ కీతో స్కూటర్ను లాక్, అన్లాక్ చేసే ఆప్షన్ కూడా ఉంది. 2 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు.. స్మార్ట్ కీ ప్రెస్ చేస్తే.. స్కూటర్ ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. వీటితో పాటు ఇంజిన్ స్టార్ట్/ స్టాప్ ఫీచర్ కూడా స్కూటర్కు ఇచ్చినట్టు కంపెనీ తెలిపింది.
మీరా బాయిగా విమలా రామన్ బర్త్ డే పోస్టర్ విడుదల!
‘రుద్రంగి’ సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది చిత్ర బృందం. ఈ సినిమాను తెలంగాణ శాసనసభ్యుడు, కవి, గాయకుడు, రాజకీయనేత ‘రసమయి’ బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ”బాహుబలి, ఆర్. ఆర్.ఆర్.” చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘రుద్రంగి’ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన కీలక పాత్రల పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. జగపతి బాబు, మమతా మోహన్ దాస్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్ పోస్టర్స్ ఇంతవరకూ విడుదల అయ్యాయి. తాజాగా జనవరి 23వ తేదీ నటి విమలారామన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ‘రుద్రంగి’లో పోషించిన మీరాబాయి లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే… ఉన్నతవంశానికి చెందిన యువతిలా ఆమె కనిపిస్తోంది. భారీ నిర్మాణ హంగులతో తెరకెక్కిస్తున్న ‘రుద్రంగి’ టాలీవుడ్ లో మరో విజువల్ వండర్ గా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నాఫల్ రాజా ఏఐఎస్ స్వర రచన చేస్తున్నారు.