NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

ఎమ్మెల్సీ అనంతబాబుకి సుప్రీంకోర్టు ఊరట

ఎమ్మెల్సీ అనంతబాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.. అనంతబాబు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతులు ట్రయల్ కోర్టు నిర్దేశిస్తుందని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసు తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాజమండ్రిలోని ఎస్సి, ఎస్టీ కోర్టు, ఏపీ హైకోర్టు (High Court) అనంతబాబు (MLC Ananthababu) బెయిల్ పిటీషన్ కొట్టేశాయి. దీనితో అనంతబాబు కుటుంబసభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. డిఫాల్ట్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును అనంతబాబు ఆశ్రయించారు. ఈ మేరకు కెవిఎట్ పిటిషన్ ను అనంతబాబు (MLC Ananthababu) కుటుంబసభ్యులు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. ఇవాళ విచారణ జరిగింది.

మాండూస్ ముగిసింది… ఇక మోగ మోగిస్తదట 

బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను ఆదివారం ఉదయం తీరం దాటింది. క్రమంగా అది బలహీనపడి… అరేబియా సముద్ర ప్రాంతానికి వెళ్లింది. దీని ప్రభావంతో గత రెండు రోజులుగా తమిళనాడు, ఉత్తర కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరం దాటినప్పటికీ ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు సముద్రం ఉగ్రరూపం దాల్చుతోంది. మాండూస్ తుపాను ముగిసేంత లోపే మరో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 16వ తేదీన బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో ఈరోజు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. రేపు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కాపుల మధ్య ఐక్యత ఎంతో అవసరం

కాపుల మధ్య ఐక్యత ఎంతో అవసరం అన్నారు మాజీమంత్రి గంటా శ్రీనివాస్ రావు. రాష్ట్రంలో ఉన్నది రెండు పార్టీలే కాదన్నారు. కాపు నాడు సభను నేను లీడ్ చేస్తున్నామనేది అపోహ మాత్రమే….ప్రతీ కార్యక్రమం అనివార్యంగా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది. దీనికి ఏ నాయకుడు మినహాయింపు కాదు అన్నారు. ఈనెల 26న విశాఖలో కాపునాడు బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాధా రంగ రీ యూనియన్ ఆధ్వర్యంలో ఏ.ఎస్.రాజా గ్రౌండ్స్ లో సభ….రంగా జన్మదిన వజ్రోత్సవాల సందర్భంగా నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణలో మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్గనైజర్లకు ఒక స్పష్టమైన విధానం ఉంది….అది త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు గంటా శ్రీనివాసరావు. పార్టీ మార్పుపై నేనెప్పుడు మాట్లాడలేదు….నిర్ణయం తీసుకుంటే నేనే ప్రకటిస్తాను….వంగవీటి పేరు సమాజంలో ఓ వైబ్రేషన్ అన్నారు. రంగా ఒక కులానికో……మాతానికో ప్రతినిది కాదు బడుగు, బలహీన వర్గాలు నాయకుడు. దేశ నాయకులతో సమానంగా విగ్రహాలు కలిగిన నేత రంగా. కాపునాడు బహిరంగ సభ విజయవంతం కావాలని గంటా అభిలషించారు. పోస్టర్ రిలీజ్ చిరంజీవి చేతుల మీద జరగాల్సి ఉంది. పద్మశ్రీ సుంకర ఆది నారాయణ మాట్లాడుతూ.. విశాఖలో మూడొంతులు వున్న కాపులు మధ్య ఐక్యత అవసరం అన్నారు. చాపకిందనీరులా పని చేసి నాయకులను గెలిపించుకోవాలన్నారు.

నెల్లూరును కుమ్మేస్తున్న వర్షాలు.. కలెక్టర్ కి వెంకయ్యనాయుడు ఫోన్

మాండూస్ తుఫాను ప్రభావం రైతాంగంపై బాగా పడింది. నెల్లూరు జిల్లా వర్షాలతో వణికిపోతోంది. నెల్లూరు జిల్లాలోని జలాశయాలన్నీ నిండుకుండలా మారాయి. సోమశిల జలాశయానికి కొనసాగుతుంది వరద ఉధృతి.. మూడు క్రస్ట్ గేట్లు ఎత్తి పెన్నా డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఇన్ ఫ్లో-20,972 క్యూసెక్కులుగా నమోదైంది. అవుట్ ఫ్లో-20,730 క్యూసెక్కులుగా వుంది. జలాశయం పూర్తి సామర్థ్యం-78 TMCలు కాగా. ప్రస్తుతం 68.615 TMCలుగా వుంది. వరద ఉధృతి క్రమేపీ పెరుగుతుండడంతో.. పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు..నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పెన్నా నదిలో పెరుగుతున్న ప్రవాహంతో సమీప గ్రామాల వాసులు వణికిపోతున్నారు. సంగం..నెల్లూరు బ్యారేజ్ ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి స్వర్ణముఖి..కాలంగి..కైవల్య నదులు. పంబలేరులో నీటి ప్రవాహం పెరిగింది. మరో 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు మత్స్యకారులకు సూచనలు జారీచేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహిస్తున్నాయి వాగులు వంకలు. ఏ. ఎస్. పేట మండలం తల్లపాడు వద్ద రహదారిపై చెరువు అలుగు వాగు పొంగి ప్రవహిస్తోంది. ఆత్మకూరు-ఏఎస్ పేట మండలాలకు నిలిచిన రాకపోకలు. సంగం మండలం పెరమన వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న బీరాపేరు వాగు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అనంతసాగరం మండలం కచ్చిరిదేవరాయపల్లి వద్ద కొమ్మలేరు వాగు ఉధృతి. ముందు జాగ్రత్తగా రాకపోకలను నిలిపివేశారు.

సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్య.. గొంతు, కాలి నరాలు కోసి
అప్పు ఇచ్చిన ఆదుకున్నాడు.. మళ్లీ తిరిగి ఆ ఆప్పుఅడుగుతున్నాడనే కక్షతో అతడిని దారుణంగా హత్య చేయించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో చోటుచేసుకుంది. ముత్యాలంపాడు క్రాస్‌రోడ్డు పంచాయతీలోని శాంతినగర్‌ కు చెందిన బీజేపీ మండల అద్యక్షుడు ధారావత్‌ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్‌ అశోక్‌ కుమార్‌ ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాప్ట్‌ వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అశోక్‌ కు భార్య అమల, రెండు నెలల పాప ఉంది. ఆన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో అప్పు ఇవ్వడమే శాపమైంది. ముత్యాలంపాడు క్రాస్‌ రోడ్‌ కు చెందిన గుగులోత్‌ ప్రేమ్‌ కుమార్‌ రూ.80వేల వరకు బాకీ ఉన్నట్లు తెలిసింది. అయితే మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా ఆశోక్‌ అప్పు ఇచ్చినట్లు సమాచారం. ఈనేపథ్యంలో తన డబ్బు తిరిగి ఇవ్వాలని అశోక్‌ ఇద్దరినీ అడుగుతుందటంతో వారు అశోక్‌ పై కక్ష పెంచుకున్నారు. అశోక్‌ ను ఎలాగైనా చంపాలని పథకం వేశారు. శనివారం రాత్రి డబ్బులు ఇస్తామని ప్రేమ్‌ కు చెప్పడంతో అశోక్‌ తన ద్విచక్ర వాహనం పై ముత్యాలం పాడు క్రాస్‌ రోడ్‌ కు ఒంటరిగా వెళ్లాడు.

పాకిస్తాన్ కు రిలీఫ్.. క్రూడాయిల్ సరఫరాకు రష్యా ఎస్

ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత, ప్రపంచంలోని అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీన్ని ఎదుర్కోవడానికి, రష్యా తన మిత్రదేశాలకు తగ్గింపు ధరలకు ముడి చమురును సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. చైనా, భారతదేశం, వివిధ యూరోపియన్ దేశాలు ఈ ముడి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన అమెరికా సహా దేశాలు భారత్‌ చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ కూడా భారత్ – రష్యా అనుకూల కార్యకలాపాలకు పాల్పడవద్దని డిమాండ్ చేస్తోంది. అయితే వాటి ఖర్చు తగ్గింపే తమకు ముఖ్యమని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే, భారత్‌కు సరఫరా చేస్తున్న అదే ధరకు పాకిస్థాన్‌కు ముడి చమురును సరఫరా చేసేందుకు రష్యా ముందుగా నిరాకరించింది. పాకిస్తాన్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ మాట్లాడుతూ, ‘రష్యా మాకు తగ్గింపు ధరకు ముడి చమురును అందిస్తోంది. కానీ ఆ రాయితీ తక్కువే’ అన్నారు. రష్యా ద్వారా సరఫరా చేయబడిన తక్కువ ధర ముడి చమురును భారతదేశం ప్రధాన దిగుమతిదారుగా ఉంది.

35 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ అదుర్స్

ఇప్పుడంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే హవా! పెరుగుతున్న పెట్రోల్ రేటుని అధిగమించేందుకు.. ప్రయాణికులు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ స్కూటర్ తయారీ కంపెనీలు ఒకదానికి మించి మరొకటి అద్భుతమైన ఫీచర్స్‌తో వాహనాల్ని దింపుతున్నారు. ఇప్పటికే బజాజ్ ఆటో, హీరో మోటొకార్ప్, టీవీఎస్ మోటార్స్, ఓలా ఎలక్ట్రిక్, ఈథర్‌తో మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో దూసుకుపోతున్నాయి. కొత్త స్టార్టప్స్ కూడా వస్తున్నాయి. అయితే.. ఈ కంపెనీలు తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 80 వేలు నుంచి రూ. 1 లక్ష వరకు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త స్టార్టప్.. ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తీసుకొచ్చింది. ఆ స్టార్టప్ పేరు బాజ్ బైక్స్. ఈ ఐఐటీ ఢిల్లీ బేస్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ బాజ్ బైక్స్.. లేటెస్ట్‌గా ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లోకి అరంగేట్రం చేసింది. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇతర కంపెనీలకు గట్టి పోటీనివ్వాలంటే, ప్రయాణికుల్ని ఆకర్షించగల ప్రణాళికల్ని సిద్ధం చేయాలి. ఈ కంపెనీ కూడా అలాంటి తెలివైన పనే చేసింది. ఇతర సంస్థలకు భిన్నంగా.. చాలా తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్‌ని రంగంలోకి దింపింది. ఈ బైక్ పేరు బాజ్ బైక్స్. దీని ధర కేవలం రూ. 35 వేలు. తక్కువ ధర ఉంది కదా.. ఫీచర్లు గొప్ప ఉండవని భావిస్తే, పప్పులో కాలేసినట్టే!

సీఎం జగన్ కి సీపీఐ రామకృష్ణ లేఖ

మాండస్ తుఫాన్ బీభత్సం కలిగించింది. తమిళనాడుతో పాటు ఏపీలోనూ వర్షాలు పంటలకు, ఆస్తులకు నష్టం కలిగించాయి. ఏపీలో తుఫాను నష్టం, రైతుల కష్టాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. మాండస్ తుఫాను సహాయక చర్యలు చేపట్టి, బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. పంట చేతికొచ్చిన తరుణంలో మాండస్ తుఫాను వల్ల వేలాది ఎకరాల పంట నీటిపాలై రైతాంగం కుదేలైంది. తీవ్రంగా నష్టాల పాలైన రైతులు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కల్లాల్లోని ధాన్యం నీట మునిగింది. అధికార యంత్రాంగం 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని మీరు చెప్పినప్పటికీ, కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉండటం విచారకరం. మా పార్టీ పార్లమెంటరీ నాయకులు, ఎంపీ బినాయ్ విశ్వం కడప కలెక్టరేట్ ను సందర్శించినప్పుడు అధికారులు ఎవరూ లేరు. తక్షణమే పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని అందించాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వండి. నష్టపోయిన వారికి తక్షణ సహాయం అందించి ఆదుకోవాలన్నారు రామకృష్ణ.

మెగాస్టార్ మూవీలో మాస్ మహారాజా లుక్ అవుట్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’లో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. 2023 సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా నుంచి రవితేజ లుక్ తో పాటు టీజర్ ను విడుదల చేశారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సాగర్ ఏసీపీగా రవితేజ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. రవితేజను ఎలా ఎలివేట్ చేయాలో అతనితో సినిమా చేసి ఉన్న బాబీకి తెలిసి ఉండటంతో ఆయన ఫ్యాన్స్ కిర్రెక్కి పోతున్నారు. ‘కారులో మేక పిల్లతో దిగి ఫైట్ చేసి ‘ఏమ్రా వారి… పిస పిసా చేస్తున్నావ్… నీకింకా సమజ్ కాలే… నేను ఎవ్వనయ్యకి విననని..’ అంటూ వార్నంగ్ ఇచ్చిన రవితేజ డైలాగ్ కి ఈలలు పడిపోతున్నాయి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కు రామ్-లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేశారు. ‘పవర్’ తర్వాత రవితేజను మరో పవర్-ప్యాక్డ్ పాత్రలో చూపిస్తున్నాడు బాబి. దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్ ను మరింత ఎలివేట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం యూరప్‌లో వీరిద్దరిపై పాటల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అద్భుతమయిన వడ్డీ పథకం తెచ్చిన ఎస్ బ్యాంక్

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన యస్ బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించింది. రూ.రెండు కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)పై వడ్డీలో ఈ మార్పు చేపట్టింది. కొత్త రేట్లు డిసెంబర్ 9 నుండి అమలులోకి వచ్చాయి. యస్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 8 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లు 8 శాతం వడ్డీ రేటు పొందాలంటే 30 నెలల పాటు ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడి పెట్టాలి. అదే సమయంలో, బ్యాంక్ సాధారణ ప్రజలకు ఈ కాలానికి చెందిన ఎఫ్‎ఢీలపై 7.50 శాతం వడ్డీ రేటుగా నిర్ణయించింది. ప్రస్తుతం 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 3.25 శాతం నుంచి 6.75 శాతం వరకు యస్ బ్యాంక్ వడ్డీని అందిస్తోంది. యస్ బ్యాంక్ వృద్ధుల కోసం 8 శాతం వడ్డీ రేటుతో 30 నెలల పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది.