ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు సాయి శ్రీనివాస్ టాలీవుడ్ లో హీరోగా తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ యేడాది ‘ఛత్రపతి’ హిందీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విశేషం ఏమంటే… సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేశ్ సైతం హీరోగా తెలుగులో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. పవన్ సాదినేని దర్శకత్వంలో బెక్కెం వేణు, బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంస్థతో కలసి గణేశ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమాను కొంత కాలం క్రితం ప్రారంభించారు. అయితే… అది కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ సినిమాకు రథన్ సంగీతం అందిస్తుండగా, ‘బ్రోచేవారెవరురా’ ఫేమ్ వివేక్ ఆత్రేయ సంభాషణలు రాశారు. కానీ ఎందుకో ఆ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ను దర్శక నిర్మాతలు కొంతకాలంగా ఇవ్వడంలేదు.
ఇదిలా ఉంటే… బెల్లంకొండ సాయి గణేశ్ తో ప్రముఖ కాస్టింగ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ సతీశ్ వేగేశ్న మూవీ నిర్మించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే తొలి యత్నంగా సతీశ్ వేగేశ్న తీసిన ‘నాంది’ నిర్మాతగా అతనికి, హీరో నరేశ్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ ఉత్సాహంతోనే బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ తో సతీశ్ మూవీ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారట. కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ప్రతిభావంతుడైన యువ దర్శకుడు కృష్ణ చైతన్య దీనికి కథను అందిస్తున్నారట. నిజానికి ఈ సమయంలో కృష్ణ చైతన్య హీరో నితిన్ తో ‘పవర్ పేట’ మూవీ చేయాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడింది. అతి త్వరలోనే బెల్లంకొండ గణేశ్ – సతీశ్ వేగేశ్న మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.