తౌక్టే తుఫాను చాలా మంది ప్రాణాలను తీసింది. కొన్ని ప్రాంతాలలో భారీ ఆస్తి నష్టం కలిగించింది. అంతేకాదు బాలీవుడ్ నిర్మాతలపై కూడా తౌక్టే తుఫాను ఎఫెక్ట్ పడింది. ముంబైలోని బాలీవుడ్ టాప్ స్టార్స్ ఫిల్మ్ సెట్లపై తౌక్టే తుఫాను ఎఫెక్ట్ భారీగానే పడింది. ‘మైదాన్’ కోసం ఏర్పాటు చేసిన సెట్ బాగా దెబ్బతింది. అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం కోసం ముంబై శివారులో ఈ ప్రత్యేక సెట్ రూపొందించబడింది. ఈ చిత్రానికి ఇలాంటి నష్టం జరగడం ఇది రెండోసారి. అంతకుముందు మే 2020లో కోవిడ్-19 లాక్డౌన్ సయమంలో వర్షాల కారణంగా ఈ సెట్ డామేజ్ కావడంతో కూల్చివేసి మళ్ళీ నిర్మించాల్సి వచ్చింది. సల్మాన్ ఖాన్ నెక్స్ట్ మూవీ ‘టైగర్ 3’ కోసం సమాచారం ప్రకారం చిత్రాన్ని నిర్మిస్తున్న యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాతలు ముంబై, గోరేగావ్లోని SRPF గ్రౌండ్లో దుబాయ్ను ప్రతిబింబించే సెట్ను నిర్మించారట. ఈ సెట్ కూడా బలమైన ఈదురు గాలులు, కుండపోత వర్షాలతో పాక్షికంగా దెబ్బతిన్నది. ఇంకా అలియా భట్, రణబీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్రా’ సెట్లో కూడా స్వల్ప నష్టాలు సంభవించాయి. అయితే అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సంజయ్ లీలా భన్సాలీ “గంగూబాయి కతియావాడి” సెట్ మాత్రం సేఫ్ గా ఉంది. ఇటీవల షీట్లతో కప్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో భారీ నష్టం నుంచి బయటపడ్డారు నిర్మాతలు.