అక్షయ్ కుమార్ నటిస్తోన్న తొలి చారిత్రక చిత్రం ‘పృథ్వీరాజ్’. ‘చివరి హిందూ సమ్రాట్’గా చరిత్రలో నిలిచిపోయిన ఆ రాజ్ పుత్ మహావీరుడు త్వరలో వెండితెరపై దర్శనం ఇవ్వనున్నాడు. మహారాజు పృథ్వీరాజ్ గా అక్షయ్, ఆయన ప్రియమైన రాణి సంయోగితగా మానుషీ చిల్లర్ నటిస్తున్నారు. ఈ సినిమాతోనే మాజీ మిస్ వరల్డ్ బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో రాబోతోంది ‘పృథ్వీరాజ్’ మూవీ. అయితే, ఇప్పుడు ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్ చుట్టూ వివాదం ముసురుకుంటోంది. అందుక్కారణం, అప్పట్లో సంజయ్ లీలా బన్సాలీ ‘పద్మావత్’ సినిమా విషయంలో సీరియస్ గా స్పందించిన కర్ణి సేన. ఇప్పుడు కూడా అదే సంస్థ ‘పృథ్వీరాజ్’ సినిమా దర్శకనిర్మాతలకి గట్టి వార్నింగ్ ఇచ్చింది.
రాజ్ పుత్ రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ గురించిన సినిమా తమకు చూపించకుండా విడుదల చేయటానికి వీల్లేదంటోంది కర్ణి సేన. అలాగే, మరో షరతు కూడా పెట్టింది యశ్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రాకు. సినిమా టైటిల్ కేవలం ‘పృథ్వీరాజ్’ అని కాకుండా ‘వీర్ యోధా సమ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్’ అని మార్చాలంటున్నారు కర్ణి సేన నాయకులు.
రాజ్ పుత్ లకు సంబంధించిన కర్ణి సేన డిమాండ్స్ పై ఇంకా ‘పృథ్వీరాజ్’ మూవీ దర్శకనిర్మాతలు స్పందించలేదు. అక్షయ్ కుమార్ కూడా సైలెంట్ గానే ఉన్నాడు. చూడాలి మరి, ముందు ముందు ఈ వివాదం ఎటువంటి మలుపులు తిరుగుతుందో! అప్పట్లో ‘పద్మావత్’ సినిమాకు కర్ణి సేన వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే, అదే సమయంలో బాగా ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు ‘పృథ్వీరాజ్’ మూవీకి కూడా ఫ్రీ పబ్లిసిటీ వచ్చే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతా యథావిధిగా సాగితే ‘పృథ్వీరాజ్’ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది…