హైదరాబాద్లో నిన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా పార్టీ అగ్ర నేత, ప్రధాని మోడీ తన ప్రసంగంలో ‘P2 to G2’ అనే మోడల్ గురించి ప్రస్తావించారు. ఈ మోడల్ని దేశం మొత్తం పాటించాలని పిలుపునిచ్చారు. దీంతో నరేంద్ర మోడీ పేర్కొన్న ఈ నమూనాకి ఫుల్ఫాం ఏంటనేది ఆస్తకికరంగా మారింది. అందుకే ఇప్పుడు దాని గురించి చెప్పుకోబోతున్నాం. P2ని (రెండు Pలని) ప్రొ-పీపుల్ పాలసీస్ అని, G2ని(రెండు Gలని) గుడ్ గవర్నెన్స్ అని విశదీకరించొచ్చు.
Read Also: Minister Roja: భీమ్లానాయక్ బిగుసుకుపోయారు.. చంద్రబాబు నీరుగారిపోయారు..!
ప్రొ-పీపుల్ పాలసీస్ అంటే ప్రజానుకూల విధానాలని, గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలన అని అర్థం. నాయకులు క్షేత్ర స్థాయికి వెళ్లి జనాలు, పార్టీ కార్యకర్తలు ఏం చెబుతున్నారో తెలుసుకోవాలని, అలా చేసినప్పుడే ప్రజానుకూల విధానాలను రూపొందించగలమని, సుపరిపాలన అందించగలమని ప్రధాని మోడీ బీజేపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ నేతలు తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు రెండు రోజులు వెళ్లి అక్కడే గడిపారని, ఈ పద్ధతిని ఇతర రాష్ట్రాల్లోనూ పాటిస్తే పార్టీకి ప్రయోజం కలుగుతుందన్నారు. నాయకులు జాగ్రత్తగా మసలుకోవాలని, అధికారాన్ని తలకెక్కించుకోవద్దని చెప్పారు.
“సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయటం ద్వారా ‘వన్ ఇండియా’ని సాధించారు. ఆ స్ఫూర్తితో ఇప్పుడు వన్ కంట్రీ అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీపైన ఉంది. తెలంగాణతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళలో బీజేపీ శ్రేణులు ఎన్నో ఆటంకాలను అధిగమిస్తూ ముందడుగు వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. దేశంలో కుటుంబ పార్టీల పాలనకు కాలం చెల్లింది. అయితే ఆయా పార్టీలను అవమానించకుండా, వాటి లోపాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి” అని ప్రధాని మోడీ ఉద్భోదించారు.