ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం అంటూ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు, నర్సులకు భరోసా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా రోగులతో నేరుగా మాట్లాడారు.. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. మీకు మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ, ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులను కూడా సీఎం పరిశీలించారు.. ఇక, ఈ సందర్భంగా గాంధీలో వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులు, జూనియర్ డాక్టర్లతో స్వయంగా మాట్లాడారు కేసీఆర్… క్లిష్ట సమయంలో ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని అభినందించారు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం జూనియర్ డాక్టర్లుగా మీ మీద ఉందన్నారు. జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రతిపాదనలను తక్షణమే పంపాలని.. ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.