Raja Singh: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బీజేపీ మరో షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కు నియోజకవర్గం టికెట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గతంలో రాజాసింగ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఝలక్ ఇచ్చిన కాషాయపార్టీ.. ఇప్పుడు విక్రమ్ గౌడ్కు తన నియోజకవర్గం టికెట్ ఖరారు చేసి త్వరలో మరో షాక్ ఇవ్వనుందని సమాచారం. గోషామహల్ నియోజకవర్గంలో విక్రమ్ గౌడ్ ఇప్పటికే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల చుట్టూ తిరుగుతున్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థిగా విక్రమ్గౌడ్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.
Read also: 900 Temples: 900 ఆలయాలు ఒక్క పర్వతంపైనే …. ప్రపంచ రికార్డు ఇండియాలోనే.
మరోవైపు జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి రాజా సింగ్ను పోటీ చేయాలని బీజేపీ కోరుతోంది. అయితే అందుకు రాజాసింగ్ సుముఖంగా లేరని తెలుస్తోంది. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్ తొలగించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అసెంబ్లీలో బీజేఎల్పీ నేతగా కూడా పనిచేశారు. రాజాసింగ్ తన సొంత నియోజకవర్గం గోషామహల్ సెగ్మెంట్ ను వదిలి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నారు. ముస్లింలను అవమానించేలా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను బీజేపీ సస్పెండ్ చేసి ఏడాది దాటింది. అయితే ఇప్పటివరకు తనపై విధించిన సస్పెన్షన్ను తొలగించడంపై నిర్ణయం తీసుకోకపోవడం, ఎంపీగా పోటీ చేయాలని సూచించడంతో గత కొంతకాలంగా రాజాసింగ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విక్రమ్ గౌడ్ తండ్రి ముఖేష్ గౌడ్ గతంలో కాంగ్రెస్ తరపున గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.
Read also: Bro: ‘బ్రో’ రన్ టైమ్ తక్కువయ్యేలా ఉందే…
ఇక 2014, 2018 ఎన్నికల్లో అదే పార్టీ చేతిలో ఓడిపోయాడు. విక్రమ్ గౌడ్ కూడా 2020 వరకు కాంగ్రెస్ పార్టీలో పలు పదవులు నిర్వహించగా.. 2016 నుంచి 2020 వరకు గోషామహల్ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు. అయితే కాంగ్రెస్పై అసంతృప్తితో రెండేళ్ల క్రితం కాషాయ కండువా కప్పుకున్నారు. విక్రమ్ గౌడ్ కాంగ్రెస్లో ఉన్న సమయంలో ఆ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. యువజన కాంగ్రెస్లో అనేక పదవులు నిర్వహించారు. విక్రమ్ గౌడ్కు నగర వ్యాప్తంగా అనుచరులు ఉన్నారు. అంతేకాకుండా ఇష్క్, గుండెజారి గల్లంతయిందే చిత్రాలను నిర్మించారు. బలమైన అభ్యర్థి విక్రమ్ గౌడ్కు టికెట్ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది. రాజాసింగ్ ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే తాను బీజేపీతోనే ఉంటానని, మరే పార్టీలో చేరబోనని రాజా సింగ్ చెబుతున్నారు. మరి రాజాసింగ్ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Health Tips: నోటి పూత ఇబ్బంది పెడుతుందా..? ఇలా చేయండి..