హుజూరాబాద్ ఉప ఎన్నికపై టిఆర్ఎస్ దృష్టి పెట్టింది. ఇప్పటికే మండలాల వారిగా పార్టీ ఇంచార్జీలను నియమించింది. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు కూడా నియెజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే పనిలో ఉన్నారు. ఉప ఎన్నిక షెడ్యులు వచ్చేనాటికి నియెజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై టిఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టారు. పార్టీ శ్రేణులను ఉప ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో ఉన్నారు ముఖ్యనేతలు. ప్రధానంగా నియెజకవర్గంలో ఉన్న సామాజిక సమీకరణాలపై లోతుగా అధ్యయనం చేసింది గులాబీ పార్టీ. నియెజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్నఆయా సామాజిక వర్గాలకు దగ్గరయ్యేందుకు వేగంగా పావులు కదుపుతోంది. పార్టీలోకి చేరికలు కూడా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు ముఖ్య నేతలు. హుజురాబాద్ నియెజకవర్గంలో ప్రధానంగా ఉన్న నాలుగైదు సామాజిక వర్గాలను తమవైపు తిప్పుకునేందుకు పార్టీ వ్యూహ రచన చేస్తోంది. ఇప్పటికే ఆయా వర్గాలు తమవైపు చూసేలా గులాబి పార్టీ వ్యూహలను సిద్దం చేసి అమలు చేస్తోంది.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్బంగా ప్రత్యర్ధి పార్టీలను దెబ్బతీసేలా సామాజిక సమీకరణాలపై నజర్ పెట్టి అక్కడ గెలుపోందింది గులాబీపార్టీ. తాజాగా హుజురాబాద్ ఉప ఎన్నికకు కూడా అటువంటి ఫార్ములాతోనే టిఆర్ఎస్ ముందుకు వెళ్తోంది. మొత్తంగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు కోసం టిఆర్ఎస్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది . మరోవైపు.. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హుజూరాబాద్ హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నువ్వానేనా అన్నట్టు అప్పుడే వార్ నడుతోంది. ఇటు ఓటర్లకు గాలం వేసేందుకు కానులక పంపిణీ కూడా జోరుగానే సాగుతోంది. .ఇప్పటి నుండే ఓట్లర్లను ప్రలోభపెడుతున్నాయి పార్టీలు. ఈటల జమున ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా గడియారాలు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై గొడవ కూడా జరిగింది. మరోవైపు అధికార పార్టీ మీటింగ్స్కి వచ్చేవారికి కూడా తాయిలాలు ఇస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీతో పాటు బీజేపీ కూడా గ్రామాల వారీగా లిస్టులు తయారుచేసుకుని కానుకలు పంపుతున్నారని చెప్పుకుంటున్నారు. గోడగడియారాలు, కుట్టు మెషీన్లు, భరిణల పంపిణీ జోరుగా సాగుతుందని టాక్ నడుస్తోంది.