గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఓ కరపత్రం ఇప్పుడు కాకరేపుతోంది.. ఈ వ్యవహారంతో స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివాదంలో చిక్కుకున్నట్టు అయ్యింది.. ప్రజాప్రతినిధులు డబ్బులు అడుగుతున్నారంటూ రిలీజ్ అయిన పాంప్లెట్ ఇప్పుడు వరంగల్ లో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాలో ఈ కరపత్రాలు హల్చల్ చేస్తున్నాయి.. వివరాల్లోకి వెళ్తే.. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలు.. రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారంటూ ఓ కరపత్రం ప్రత్యక్షమైంది.. గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రం విడుదల చేయడంతో వరంగల్లో కలకలం రేపుతోంది. మొదటి నుండి పార్టీలో పనిచేస్తున్న వారికి కాకుండా రౌడీషీటర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లు ఇస్తున్నారంటూ ఆ కరపత్రాల్లో ఆవేదన వ్యక్తం చేశారు..
డివిజన్లలో సర్వేల పేరుతో టికెట్లను కేటాయిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం చేస్తున్నా.. అవి నామమాత్రమేనని ఎమ్మెల్యేలే చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కరపత్రంలో రాసుకరావడంతో చర్చగా మారింది.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గెలిచే అభ్యర్థులకు, పార్టీ కోసం పనిచేసే వారికి, విద్యావంతులకు టికెట్లు దక్కేలా చూడాలని, దీనిపై ట్విట్టర్లో స్పందించాలని కోరడం ఆశావహులు టికెట్ ఆశించి చేదుఅనుభవం ఎదురైనవారు కోరుతున్నారు.. అయితే, ఎన్నికల సమయంలో కరపత్రం అధికార పార్టీలో వివాదంగా మారగా.. ప్రతిపక్షాలే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ కొట్టిపారేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు.. మరి ఈ కరపత్రాలు రాసింది ఎవరు.. ఫ్రింట్ చేయించింది ఎవరు? అనేది తేలాల్సి ఉన్నా.. ఎన్నికల ముందు ఈ వ్యవహారం మాత్రం హాట్ టాపిక్గా మారిపోయింది.