అన్నం తింటున్నారా..? గడ్డి తింటున్నారా..? అంటూ అధికారులపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు అధికార పార్టీ ఎమ్మెల్యే… కొమురం భీం జిల్లా పరిషత్ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది… జిల్లా పరిషత్ సమావేశంలో ఆర్ అండ్ బీ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప… కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నుండి కాగజ్ నగర్ వెళ్లే రోడ్డుపై ఎందుకు అలసత్వం చేస్తున్నారని ప్రశ్నించారు.. మీ ఇంటికి వెళ్ళే దారి ఇలాగే ఉందా..? అని నిలదీశారు.. మేం ప్రజల్లో తిరిగేవాళ్లం.. ప్రజలు నిలదీస్తే సమాధానం చెప్పలేక పోతున్నాం.. మాకు ఈ పదవి ఉన్నా ఒక్కటే… లేకున్నా ఒక్కటే… కానీ, స్పష్టంగా చెప్పండి. రోడ్డు ఎప్పుడు చేస్తారో అంటూ జెడ్పీ సమావేశంలో నిలదీశారు. మార్చి నెలలో సమస్యలపై మెసేజ్ పెడితే ఇంత వరకు అధికారులు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. అంత అలసత్వమా…? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వెళ్లిపోయారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప..