తెలంగాణ వచ్చాక నిరుద్యోగుల కష్టాలు రెట్టింపయ్యాయన్నారు టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కిరాణా మర్చంట్ అసోసియేషన్ భవనంలో నిరుద్యోగుల ఆత్మస్థైర్య సదస్సులో పాల్గొన్నారు కోదండరాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు 3శాతం వున్న నిరుద్యోగం ఏడున్నర ఏళ్లలో మూడింతలు 8శాతానికి పెరిగింది. తెలంగాణలో నిరుద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే నిరుద్యోగం తగ్గిందా… పెరిగిందా ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పాలి.
తెలంగాణలో ఇప్పటి వరకు భర్తీ అయిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య 80 వేలలోపే, కానీ సీఏం కేసీఆర్ అసెంబ్లీలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అబద్దం చెప్పడం సిగ్గుచేటు. ఈ సంఖ్యపై దమ్ముంటే బహిరంగ చర్చకు నేను సిద్దం, దీనికి సీఏం కేసీఆర్ సిద్దమా ? అని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణలో ఇప్పటి వరకు దాదాపు 200 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ ఏడాదిలోనే 21 మంది నిరుద్యోగులు చనిపోయారు. డిసెంబరు 3న హైదరాబాదులో జరిగే తెలంగాణ యూత్ డిమాండ్స్ డే కార్యక్రమానికి నిరుద్యోగులు, యువకులు భారీగా తరలి రావాలన్నారు.