రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవడంలో ప్రజలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ‘రహ-వీర్’ (Rah-Veer) పథకాన్ని అమలులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయంలో సహాయం అందించి, వారి ప్రాణాలను కాపాడే వ్యక్తులకు భారీ నగదు బహుమతిని ప్రకటించింది.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్బ్యాండ్ కేవలం రూ.999కే..!
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారు పోలీసు కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయంతో సహాయం చేయడానికి వెనుకాడుతుంటారు. ఈ భయాన్ని పోగొట్టి, బాధితులకు ‘గోల్డెన్ అవర్’ (ప్రమాదం జరిగిన మొదటి గంట) లోపు వైద్యం అందేలా చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఎవరైనా వ్యక్తి రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి, సరైన సమయంలో ఆసుపత్రికి చేర్చి వారి ప్రాణాలను నిలబెడితే, ప్రభుత్వం వారిని ‘రహ వీర్’గా గుర్తిస్తుంది. ఇలాంటి ప్రాణదాతలకు తెలంగాణ రవాణా శాఖ రూ.25,000 నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేస్తుంది.
ఈ రివార్డుకు అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉండే ఈ కమిటీలో జిల్లా ఎస్పీ, జిల్లా వైద్యాధికారి (DMHO), రవాణా శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి చేర్చిన వ్యక్తి వివరాలను ఆసుపత్రి సిబ్బంది లేదా పోలీసులు నమోదు చేస్తారు. ఆ తర్వాత జిల్లా స్థాయి కమిటీ ఆ వివరాలను , ప్రమాద తీవ్రతను పరిశీలించి, సదరు వ్యక్తికి రివార్డు ఇవ్వాల్సిందిగా రవాణా కమిషనర్కు సిఫార్సు చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే నగదు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది.
సహాయం చేసే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ (Good Samaritan) చట్టాన్ని పక్కాగా అమలు చేస్తోంది. దీని ప్రకారం, ప్రమాద బాధితులను ఆసుపత్రికి చేర్చిన వ్యక్తిని పోలీసులు బలవంతంగా ప్రశ్నించడం గానీ, సాక్ష్యం చెప్పమని ఒత్తిడి చేయడం గానీ చేయకూడదు. బాధితులను కాపాడటమే పరమావధిగా ఈ పథకం రూపొందించబడింది. కేవలం రివార్డు కోసం మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయాల్లో స్పందించాలని ప్రభుత్వం కోరుతోంది.