Telangana Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం పర్వం ముగియడంతో రాజకీయ వాతావరణం పతాక స్థాయికి చేరింది. రేపు (బుధవారం) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. దాదాపు 52 లక్షల మంది ఓటర్లు 12,993 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 2,996 వార్డుల్లో పోలింగ్ జరగనుంది. ప్రతి ఓటరు తన హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని ఉద్యోగులు, కార్మికులందరికీ వేతనంతో కూడిన సెలవును (Paid Holiday) ప్రకటించింది.
ప్రైవేట్ సంస్థలు , ఫ్యాక్టరీల్లో పనిచేసే వారు కూడా ఓటు వేసేందుకు వీలుగా కార్మిక శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో సుమారు వేల సంఖ్యలో సిబ్బంది పాల్గొంటుండగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) జరుగుతున్న ఈ మున్సిపల్ ఎన్నికలు పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దిక్సూచి వంటివి. రేపు జరగనున్న పోలింగ్లో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుండగా, 16న మేయర్ , చైర్మన్ల పరోక్ష ఎన్నిక జరగనుంది.
AP Assembly Budget Session: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. రేపు సభకు వైఎస్ జగన్..