రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6300గా ఉందని వెల్లడించారు.. మార్కెట్ ధర కనీస మద్ధతు ధర కన్నా ఎక్కువ ఉన్నా కూడా అదే ధరకు కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు నిరంజన్ రెడ్డి.
ఇక, మినుముల కొనుగోలుకు అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం అన్నారు మంత్రి నిరంజన్రెడ్డి… దేశ వ్యాప్తంగా మినుములు, మినపపప్పు కొరత తీవ్రంగా ఉందని.. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వ సంస్థ నాఫెడ్ ను సంప్రదించిందని వెల్లడించారు.. నిన్ననే రాష్ట్రానికి మినుముల కొనుగోలుకు సంబంధించి నాఫెడ్ సంస్థ లిఖితపూర్వక హామీ ఇచ్చిందని.. మినుములతో పాటు మార్కెట్ లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని సూచించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి..