తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశం రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. ఐదు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. లాక్డౌన్ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు ఇచ్చింది. ఇక కోవిడ్ నిబంధనల సడలింపు నేపథ్యంలోనే ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది.