కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దీంతో విస్తృతంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ఇదే సమయంలో.. సోషల్ మీడియా వేదికగా కొందరు ఫేక్గాళ్లు.. వ్యాక్సినేషన్పై తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు. ఇది నిజమా..? అబద్ధమా..? అని నిర్ధారణకు రాకుండానే.. చాలా మంది లైక్లు, షేర్లతో అది కాస్త వైరల్ చేస్తున్నారు. తాజాగా.. వ్యాక్సిన్ తీసుకోనివారికి వచ్చేనెల (నవంబర్ 1వ తేదీ) నుంచి రేషన్, పింఛన్ నిలిపివేసే ఆలోచనలో వైద్యారోగ్య శాఖ ఉందంటూ.. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వైరల్ న్యూస్ కాస్త.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వరకు చేరింది. దీంతో క్లారిటీ ఇచ్చారు తెలంగాణ ప్రజా వైద్యరోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు.. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని, ప్రజలు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని, ఆందోళనకు గురికావద్దని సూచించారు.. ఇలాంటి తప్పుడు వార్తలను వైరల్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు డీహెచ్ శ్రీనివాసరావు.