తెలంగాణలో పోడు భూముల సమస్య ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.. గిరిజనులు పోడు చేసుకోవడం.. ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం.. తోపులాటలు, ఘర్షణలు, దాడులు.. ఇలా.. చాలా సందర్భాల్లో సమస్యలు వస్తున్నాయి.. అయితే, పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కై పోడు భూములకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు.. ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు సీఎస్ సోమేష్ కుమార్.. ఈ విషయంలో విధి విధానాలు నిర్ణయించేందుకు ఈ సమావేశం జరిగింది..
అక్టోబర్ మూడో వారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని ఈ సందర్భంగా వెల్లడించారు సీఎస్ సోమేష్ కుమార్.. ఇందుకు దరఖాస్తు ఏ విధంగా ఉండాలి, దరఖాస్తులో పొందుపరిచే అంశాలు, అటవీ సరిహద్దుల కోఆర్డినెట్స్ నిర్ణయం, వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు, అటవీ పరిరక్షణకు పౌరుల భాగస్వామ్యం తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్లు, అటవీ శాఖ కన్సర్వేటర్లు, డీఎఫ్వోలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.. కాగా, పోడు భూముల సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపనున్నట్టు ఈ మధ్యే సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.