ఈనెల 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సమర్పణలో స్పెషల్ సాంగ్ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ నిర్మాతగా పూర్ణ దర్శకత్వంలో మాట్ల తిరుపతి రచనలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని బంజారాహిల్స్ ఎల్వీ ప్రసాద్ డిజిటల్ ల్యాబ్లో హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ రంజిత్ రెడ్డి ఆవిష్కరించారు.
అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. పాటను చూడగానే సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం చేసిన పోరాటాలు గుర్తుకువచ్చాయన్నారు. ఇంత మంచి సాంగ్ రూపొందించినందుకు అభినందనలు తెలియజేశారు. గాంధీ తర్వాత అంతటి గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ కోసం ఎన్నో ఏళ్ళు శ్రమించి ప్రాణం పోయినా ఫర్వాలేదని తెలంగాణ కోసం కోట్లాడి సాధించారన్నారు. ఇప్పుడు దేశంలోనే తెలంగాణను నంబర్వన్గా నిలిపారని మహమూద్ అలీ కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్ని పండుగలు ఘనంగా జరుపుతున్నారన్నారు. రాష్ట్రం రాకముందు కమ్యునల్ గొడవలు ఉండేవి ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని తాగునీటి, సాగునీటికి ఇబ్బందులు లేవన్నారు.
కొత్త ప్రయాణానికి నాంది పలకబోతున్న సీఎం కేసీఆర్కు నిండునూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆకాక్షించారు. ఈ పుట్టినరోజు ప్రత్యేకమైనదని రేపటి నుండి కొత్త భారత నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నారని అందరూ వేచిచూస్తున్నారన్నారు. అహర్నిశలు పోరాడి తెలంగాణ తెచ్చి బంగారు తెలంగాణ చేశారని.. ఇప్పుడు భారతదేశంలో ఉన్న సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఇంత మంచి సాంగ్ రూపొందించిన రూపకర్తలకు ఎంపీ రంజిత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.
అనంతరం బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో ఏళ్ళు శ్రమించారన్నారు. ఎందరో అవహేళన చేసిన అన్ని తట్టుకొని అసాధ్యాన్ని సుసాధ్యం చేశారన్నారు. దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరం ఎంతగానో ఉందని మతోన్మాద శక్తుల నుండి దేశానికి విముక్తి లభించాలంటే దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని అందరం ప్రార్థిద్దామని బాబా ఫసియుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు, టీఆర్ఎస్ సీనియర్ నేతలు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రామ్మూర్తి, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, బిసి కమిషన్ సభ్యుడు కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.