కేంద్రం ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మా అవార్డుల్లో తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెర కళాకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు భారీ సాయాన్ని ప్రకటించారు తెలంగాణ సీఎం కేసీఆర్.. హైదరాబాద్లోని నివాసయోగ్యమైన ఇంటి స్థలంతో పాటు.. ఇంటి నిర్మాణం ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని ప్రకటించారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొందిన కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్య.. ఇవాళ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ను కలిశారు.. ఈ సందర్భంగా మొగిలయ్యను శాలువాతో సత్కరించిన ఆయన.. తెలంగాణ గర్వించదగ్గ గొప్ప కళారూపాన్ని కాపాడుతున్న మొగిలయ్య అభినందనీయుడన్నారు.
కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. మొగిలియ్యకు నివాసయోగ్యమైన ఇంటిస్థలం తో పాటు నిర్మాణానికి అయ్యే ఖర్చు కోటి రూపాయలను ప్రకటించిన ఆయన.. ఇందుకు సంబంధించి మొగిలయ్యతో సమన్వయం చేసుకోవాలని, కావాల్సిన ఏర్పాట్లను చూసుకోవాలని, ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు.. ఇప్పటికే మొగిలయ్య కళను ప్రభుత్వం గుర్తించిందని గౌరవ వేతనాన్ని కూడా అందిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ కళలను పునరుజ్జీవింప చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు.. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ఉగాది పురస్కారాల్లో కూడా మొగిలయ్యను సీఎం కేసీఆర్ సత్కరించిన విషయం తెలిసిందే..