హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని.. దానికి సంబంధించిన సర్వే నివేదికలు కూడా వచ్చాయని తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.. 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి కలిశాం అన్నారు.. ఇక, ఈటల రాజేందర్ ఎన్నికల్లో గెలుస్తారనే సర్వే రిపోర్ట్స్ వచ్చాయన్న ఆయన.. బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా తెలంగాణకు వస్తామని అన్నారని అలాగే పాదయాత్రకు కూడా ఆయన్ను ఆహ్వానించామని తెలిపారు.
ఆగస్టు 9వ తేదీన పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు బండి సంజయ్.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ సిద్ధమేనన్న ఆయన.. టీఆర్ఎస్ పార్టీ భయపడుతోంది.. వారికి అభ్యర్థి కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు.. డబ్బులు ఎంత పంచినా.. అది ప్రజల సొమ్మే కాబట్టి తీసుకుందాం.. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ను గెలిపిద్దాం అని ఓటర్లు అనుకుంటున్నారని వెల్లడించిన ఆయన.. అవినీతి, అక్రమాలు, అరాచక పాలనను అంతం చేయడం కోసం పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు.