Konda Surekha : కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
బీసీ కులగణనను కార్యరూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా పనిచేశారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్లో పొందుపరిచిన ప్రకటనల ప్రకారం ఈ బీసీ సర్వేను విజయవంతంగా అమలు చేయడం ఇందుకు నిదర్శనమని తెలిపారు.
Accident : పెద్దఅంబర్ పేట్లో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి
కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఈ మొత్తం ప్రక్రియలో ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచిందని, పార్టీ అధినేతలు అందించిన సహాయ సహకారాలతోనే ఈ భారీ సర్వే చేపట్టగలిగామని కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. బీసీ ప్రజలకు ఈ సర్వే ద్వారా మరింత న్యాయం చేయడానికి అవకాశం లభిస్తుందని, వారి సంక్షేమానికి ఇది ఓ కీలక ముందడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కొండా సురేఖ, ఈ సర్వే విజయవంతం చేయడంలో సహకరించిన ఏఐసీసీ అగ్రనేతలకు వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్రంలో బీసీ సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న ఈ చర్యలు బలమైన ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
Mahindra XUV400 : బంఫర్ ఆఫర్.. ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా 4లక్షల తగ్గింపు!