బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలకు స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అనుమతించలేదు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్కు గురైన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు,ఈటల రాజేందర్, రాజాసింగ్ ఇవాళ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారు అసెంబ్లీకి వెళ్లి స్పీకర్ని కలిశారు. తమ సస్పెన్షన్ పై ఈ ముగ్గురు ఎంఎల్ఎలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
సస్పెన్షన్పై స్పీకర్దే తుది నిర్ణయమని హైకోర్టు పేర్కొంది. స్పీకర్ను కలవాలని హైకోర్టు ఎమ్మెల్యేలకు సూచించింది. దాంతో వారు స్పీకర్ను కలిసి కోర్టు ఉత్తర్వుల కాపీ ని అందచేసారు. ఉత్తర్వ్యులు ఎప్పుడు వచ్చాయని స్పీకర్ వారిని అడిగారు. సోమవారం సాయంత్రం వచ్చాయని చెప్పినట్టు ఎమ్మెల్యే రఘునందన్ రావు వివరించారు. ఏమైనా చెప్పేది ఉందా అని స్పీకర్ అడగటంతో వారు తమ వాదనలు వినిపించారు. తాను, ఈటల రాజేందర్ తమ తమ స్థానాల నుంచి కదలలేదని స్పీకర్కు వివరించినట్టు రఘునందన్ రావు చెప్పారు.
ఎమ్మెల్యేల అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. వారిని సభలోకి అనుమించేదిలేదని స్పష్టం చేశారు. దాంతో వారు అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లిపోయారు. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకున్నారే కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి ని గౌరవించలేదని ఎమ్మెల్యే రఘునందన రావు వ్యాఖ్యానించారు. రేపు టీఆర్ఎస్ ని చూసి నవ్వే రోజు వస్తుందన, ప్రజలే వారిని శిక్షిస్తారని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.