Site icon NTV Telugu

Telangana Assembly session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కీలక ప్రకటనలకు సిద్ధమైన సర్కార్..!

Telangana Assembly

Telangana Assembly

మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి… రేపు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి… మొదటి రోజు మృతిచెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాక ఎల్లుండికి సభ వాయిదా వేయనున్నారు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి… ఇక, రేపు జరగనున్న బీఏసీ సమావేశంలో.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. ఇక, సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఒకేసారి శాసన సభ సమావేశాలతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా జరగనుండడంతో.. అసెంబ్లీ, కౌన్సిల్ ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు..

Read Also: Atrocious Incident: కారుణ్య ఉద్యోగం కోసం దారుణం.. మామను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన అల్లుడు..

అయితే, ఈ సారి సమావేశాల్లో కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత ఏర్పడగా.. కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.. రైతుల సమస్యలు, అధిక వర్షాల కారణంగా జరిగిన నష్టం, పోడు భూముల అంశం, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, తదితర అంశాలు ఈ సెషన్‌లో చర్చకు వచ్చే అవకాశాలు ఉండగా.. కొన్ కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు చెబుతున్నారు.. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి… సంయుక్తంగా ప్రభుత్వ అధికారులు.. పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన అసెంబ్లీ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌.. సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని పేర్కొన్నారు.. ఇక, సమావేశాల దృష్ట్యా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీన ముగియడంతో.. సెప్టెంబర్ 14వ తేదీలోపు అసెంబ్లీ మళ్లీ సమావేశం అవ్వాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది ప్రభుత్వం.

Exit mobile version