వృత్తిరీత్యా అతనో టెక్కీ, కానీ కరోనా దెబ్బకు ప్రముఖ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ను తీసుకురావడంతో చాలా మంది తాము చేస్తున్న పనులకు అదనంగా కొత్త దారుల వెంట పయనిస్తున్నారు. ఈ కోవలోకే వస్తాడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పదిరి మాధవ రెడ్డి. వ్యవసాయంపై మక్కువతో ఆధునిక సాగుతో లాభదాయకమైన పంటలను వినూత్న పద్ధతులతో పండిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు..సూర్యాపేట జిల్లా, ఆత్మకూర్కు చెందిన పదిరి మాధవరెడ్డి.
ఈ కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్తో పని చేస్తూనే మరోవైపు వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టాడు. బెంగళూరులోని ఐసీటీ ఇన్ఫోటెక్లో పనిచేస్తున్న మాధవ రెడ్డి గతేడాది కాలంగా ఇంట్లోనుంచే పనిచేస్తున్నారు. దీంతో అతడు ఆఫీస్ పని వేళలు ముగించుకున్న తర్వాత వ్యవసాయ రంగంలో తన కుటుంబానికి అండగా నిలుస్తున్నాడు. తనకున్న 10 ఎకరాల్లో మాధవరెడ్డి ఖరీఫ్లో నల్ల వరిపంట(బ్లాక్ రైస్)ను సాగు చేశారు. ఇది మంచి లాభాలు రాబట్టింది. వినూత్న పద్ధతుల్లో సాగు చేస్తున్న మాధవరెడ్డి 20 మంది రైతులకు ప్రేరణగా నిలిచాడు. ఇప్పుడు వారు కూడా అదేబాటలో పయనిస్తున్నారు. ఐదెకరాల్లో వరిసాగు చేపట్టేందుకు డ్రమ్ సీడర్ను కూడా ఉపయోగించాడు. స్థానిక రైతులకు వ్యవసాయంలో టెక్నాలజీని ఎలా ఉపయోగించాలో కూడా మాధవరెడ్డి వివరిస్తున్నారు.
32 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాధవరెడ్డి మాట్లాడుతూ తనకు వ్యవసాయంపై ఎంతో ప్రేమ ఉందన్నారు. ఐదవ తరగతి నుంచి తన తండ్రితో పాటు కలిసి పొలాలకు వెళ్లేటప్పుడు వారు చేస్తున్నపనులు చూసేవాడినని తెలిపారు. ప్రస్తుతం ఇంటి నుంచి పని చేయడం వలన ఖాళీ సమయాన్ని మంచి పనికి వినియోగించుకోవాలని అనుకున్నానని తెలిపాడు. ఆఫీస్లో లాగిన్ చేయనవసరం లేనప్పుడు వారాంతాల్లో పొలాల్లో ఎనిమిది గంటలు పని చేస్తాను. వారపు రోజులలో మూడు గంటలు పని చేస్తానని మాధవరెడ్డి వివరించారు.
డ్రమ్సీడర్ వాడకం వల్ల ఖర్చు తగ్గుతుంది.డ్రమ్ సీడర్ వాడకం వల్ల వరి సాగుకు హెక్టారుకు రూ.10 వేలు ఖర్చు తగ్గుతుందని, నర్సరీల మార్పిడి పద్ధతిలో సాగుతో పోలిస్తే 15 శాతం పంట దిగుబడి పెరుగుతుందని చెప్పారు. వచ్చే సీజన్లో దేశీ విత్తనాలతో సేంద్రీయ వరి సాగు చేపట్టాలని అనుకుంటున్నట్టు మాధవరెడ్డి వివరించారు. మంచి సాగు పద్ధతుల కోసం ఆన్లైన్లో పత్రికలు, కథనాలను చదవడానికి సమయాన్ని వెచ్చిస్తానని పేర్కొన్నాడు.
అదే గ్రామానికి చెందిన రైతు సుధాకర్రెడ్డి మాట్లాడుతూ మాధవరెడ్డి నల్ల వరి పంటతో డబ్బు సంపాదించిన విషయం తెలుసుకున్నా. రెండెకరాల్లో నల్ల వరి సాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. “బ్లాక్ రైస్కు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉందని చెప్పారు. మాధవరెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని వరి నాట్లు వేసేందుకు డ్రమ్ సీడర్ను తీసుకున్న 10 మంది రైతుల్లో తానూ ఉన్నానని మరో రైతు విశ్వరామ్రెడ్డి తెలిపారు. ఈ పద్ధతిలో సమయం ఆదా అవుతుంది మరియు వరి నర్సరీల నుండి నాట్లు చేసే సాంప్రదాయ పద్ధతితో పోలిస్తే తక్కువ మానవశక్తి అవసరమవుతుందని, దీని ద్వారా ఖర్చు తగ్గుతుందని ఆయన తెలిపారు.
మొత్తం మీద రోజుకి 12 గంటల వరకూ కష్టపడుతూ.. అటు జీతం, ఇటు వ్యవసాయరంగం నుంచి అదనపు ఆదాయం అందుకుంటూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు మాధవరెడ్డి.