తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. తొలిరోజే.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరును ప్రస్తావించారు.. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే పీకేను సలహాదారుగా పెట్టుకోవాలి అని కొందరు మిత్రులు సలహా ఇస్తున్నారు.. కానీ, తెలంగాణలో ఉన్న ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త ఓక పీకేయే నని.. ఇంత మంది పీకేలు ఉండగా.. మనకు పీకే అవసరమా..? అని ప్రశ్నించారు.. ఇక, సోనియా, రాహుల్ గాంధీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆయన.. నా భాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చిన పార్టీ నేతలందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు.. వర్షం పడుతూ ఆ దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించాడన్న కొత్త పీసీసీ చీఫ్.. పోచమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీనరసింహస్వామి దయతో పాటు సోనియమ్మ ఆశీస్సులతో ఈ పదవి చేపడుతున్నా అన్నారు.
సభా వేదిక నుంచి ఈ రోజు చెబుతున్నా.. జై సోనియమ్మ, రాహుల్ గాంధీల నినాదాలు తప్ప మరో వ్యక్తి నినాదం వినిపించకూడదని స్పష్టం చేవారు రేవంత్రెడ్డి.. సోనియా, రాహుల్ నినాదం మినహా మరో వ్యక్తి నినాదం చేస్తే.. ఎంతటి వారినైనా క్షమించమని హెచ్చరించారు.. నా అభిమానులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ రోజు నుంచి వ్యక్తుల నినాదాలు ఇవ్వొద్దని సూచించారు. మన తెలంగాణ తల్లి… తెలంగాణ ఇచ్చిన సోనియమ్మే.. నాలుగు కోట్ల ప్రజలు తమ ఇళ్లలో సోనియమ్మ ఫొటో పెట్టుకోవాలని.. నాయకుల సందేశాన్ని ప్రతీ గడపగడపకు తీసుకెళ్లాలని సూచించారు రేవంత్.. వేలాది మంది సైనికులకు నాయకుడు ముందు ఉంటే.. ఈ ప్రపంచాన్ని గెలువొచ్చు.. అలా ముందుకు నడిపించే సోనియా, రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. ఇక, టీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులు, దళితులు, బడుగు బలహీన వర్గాలను నయవంచనకు గురిచేస్తోందని మండిపడ్డ ఆయన.. కరోనా కంటే డేంజర్.. మోడీ, కేసీఆర్ అని వ్యాఖ్యానించారు.. ప్రతీ కార్యకర్త రెండు సంవంత్సరాలు ఇంటికి సెలవు పెట్టాలి.. రెండేళ్లు కష్టపడితే.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పుడు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉంటే… ఇప్పుడు లక్షా 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు న్యూ పీసీసీ చీఫ్.. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని రాష్ట్ర పొలిమేరలు దాటించాలని.. అప్పుడే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. రావణాసురుడు సీతమ్మను ఏం చేసాడో మనకు తెలుసు.. ఇప్పుడు కేసీఆర్ రావణాసురుడు వలె తెలంగాణ తల్లిని ప్రగతి భవన్లో బందీని చేసాడని.. ఆనాడు సీతను రాముడు విముక్తి చేస్తే.. ఇప్పుడు తెలంగాణ తల్లిని విముక్తి చేయమని సోనియమ్మ నన్ను పంపించిందన్నారు. రాముడికి వాణరసైన్యం సహాయం చేసినట్లు.. మీరు నాకు సహాయం చేయాలని కార్యకర్తలను కోరారు రేవంత్ రెడ్డి.