Minister Sridhar Babu : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన తరుణంలో అధికార కాంగ్రెస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం ముదిరింది. “ముఖ్యమంత్రులే మా దగ్గరకు రావాలి” అని అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ గెలుపుపై అక్బరుద్దీన్ చేసిన క్లెయిమ్ను ఆయన తోసిపుచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం మరొకరి భిక్ష కాదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. “జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేసి గెలిచింది. మా పార్టీ నేతలు, కార్యకర్తలు రాత్రింబగళ్లు కష్టపడితేనే ఆ విజయం సాధ్యమైంది” అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రజాదరణను తక్కువ చేసి చూపడం అక్బరుద్దీన్కు తగదని ఆయన హితవు పలికారు.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓటేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా రంజక పాలన చూసి ఓటర్లు పట్టం కట్టారని, తమ గెలుపును మరొకరి ఖాతాలో వేయాలని చూడటం ముమ్మాటికీ పొరపాటని ఆయన వ్యాఖ్యానించారు. తామే గెలిపించామని ఎవరైనా భ్రమల్లో ఉంటే అవి వదిలేసుకోవాలని అక్బరుద్దీన్నుద్దేశించి మంత్రి చురకలు అంటించారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తమ ఉనికిని చాటుకోవడానికి, ఓటర్లను ఆకర్షించడానికే ఎంఐఎం నేతలు ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇలాంటి వ్యాఖ్యలకు మున్సిపల్ ఎన్నికల్లోనే సరైన సమాధానం చెబుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎంఐఎం మద్దతు లేకుండానే కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా తన సత్తా చాటుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.