రోహిణి కార్తి వచ్చిందంటే చాలు ఎండలు తీవ్ర రూపం దాల్చుతాయి. రోహిణి కార్తెలో ఎండలకు రోకళ్లే పలుగుతాయానే నానుడి ఉంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తొలిరోజుల్లో కొద్ది కొద్దిగా పెరిగి తాపం పెరుగుతోంది. దినదిన ప్రవర్ధమానంగా భానుడి భగ భగలు మనపై తెలుస్తూనే ఉన్నాయి. మామూలుగా ఉండే ఎండల వేడిని తట్టుకోలేమంటే, ఎండాకాలంలో చివరి కార్తె అయిన రోహిణిలో ఎండల తీవ్రత మరింత పెరుతుంతుంది. అయితే నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. అయితే.. ఈ సంవత్సరం రోహిణి కార్తె మే 25న ప్రారంభమై జూన్ 8 వరకు ఉంటుంది.
రోహిణి కార్తె ఫలితంగా ఈ పక్షం రోజులు అధిక వేడి గాలులు, ఎండ తీవ్రతలు, అగ్నిప్రమాదాలు, ఉక్క పోతలు ఎక్కువగా ఉండనున్నాయి. ఎండ తీవ్రతకు శరీరం అలసిపోతుంది. కావున ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ కుండ నీళ్లు తాగడం, మజ్జిగ, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, రాగి జావ, ఫలూదా లాంటివి ఎక్కువగా తాగడం వల్ల, ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలకు మీరు ఉండే ఇంటి ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి తడి గుడ్డతో తుడిచి, బట్టలు మార్చండి. ఎవరైనా సరే ముదురు రంగు దుస్తులు వేయకపోవడం మంచిది. ముఖ్యంగా సాటి జీవులైన పశు, పక్షాదులకు త్రాగడానికి మీరు నివసించే చోట వాటిని నీళ్ళు ఏర్పాటు చేయండి.