ముఖ్యమంత్రి కేసీఆర్కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మిర్చిరైతుల సమస్యలపై బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారంగా చెల్లించాలన్నారు.మిగత పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందజేయాలన్నారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
Read Also: కొడాలినాని ఆధ్వర్యంలో విష సంస్కృతిని తీసుకొచ్చారు: వర్ల రామయ్య
మిర్చి పంట మంచిగా పడితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడిని రైతులు పెట్టారని లేఖలో పేర్కొన్నారు. కానీ తామర తెగులుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారన్నారు. ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారని ఆరోపించారు.రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి దాదాపు 8.633 కోట్ల నష్టం వచ్చిందన్నారు. కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏమి చేశారో రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని రేవంత్రెడ్డి లేఖలో వెల్లడించారు.