తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు మరింత వేడెక్కాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి బలమైన కోటలుగా ఉన్న సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ రెండు ప్రాంతాల్లో త్వరలోనే మువ్వన్నెల జెండాను ఎగరేయడమే తమ తదుపరి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
సిరిసిల్ల, సిద్దిపేటలపై కాంగ్రెస్ దండయాత్ర
సిరిసిల్ల, సిద్దిపేట గడ్డలపై రాబోయే రోజుల్లో విజయం కాంగ్రెస్దేనని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులో సిరిసిల్ల పర్యటనకు వెంటనే రంగం సిద్ధం చేయాలని వేదికపై నుంచే పీసీసీ అధ్యక్షుడికి సూచించారు. ఈ నెలాఖరుకు సిరిసిల్లకు, ఆ తర్వాత వచ్చే నెలలో సిద్ధిపేటకు కాంగ్రెస్ సైన్యంతో తరలివెళ్లి సభలు నిర్వహిస్తామని, ఆ స్థానాల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగరేస్తామని ప్రకటించారు.
కేసీఆర్ కుటుంబానికి నేరుగా సవాల్
సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు కేటీఆర్, హరీష్ రావులు ఎవరిని తెచ్చుకున్నా తేల్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బంధువులను తెచ్చుకుంటారో, అనుచరులను తెచ్చుకుంటారో తెచ్చుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తల బలంతో ఈసారి ఆ రెండు స్థానాల్లోనూ విజయం సాధించి తీరుతామని సవాల్ విసిరారు.
శాసనసభలోనే లెక్కలు తేలుద్దాం
రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వడ్లకు బోనస్ , ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాల కోసం రూ. 70,000 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ధైర్యముంటే కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు శాసనసభకు వచ్చి తమ పాలన నిజాయితీపై, చేసిన ఖర్చులపై చర్చకు రావాలని, సభలోనే లెక్కలు తేల్చుకుందామని డిమాండ్ చేశారు.
ఫార్మ్హౌస్కే పరిమితమైన కేసీఆర్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమాన్ని , నిరుద్యోగ యువత సమస్యలను పూర్తిగా గాలికి వదిలేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు. నేడు తమ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తుంటే, ఓటమి భయంతో ఫార్మ్హౌస్కే పరిమితమైన కేసీఆర్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

