CM Revanth Reddy : కేసీఆర్‌కు రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.!

  • రైతు భరోసా నిధుల విడుదల
  • కేసీఆర్ అప్పులపై సీఎం విమర్శలు
  • రూ.36 వేల కోట్ల రైతు సాయం
  • అసెంబ్లీ చర్చకు కేసీఆర్‌కు సవాల్
Revanth

Revanth

CM Revanth Reddy : శిల్పకళావేదికలో నిర్వహించిన రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో రైతు సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించామని, తాము సాధించిన విజయాలను ప్రజల ముందు ఉంచుతున్నామని ప్రకటించారు. ఈ క్రమంలోనే తొలి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్ల నిధులను ప్రభుత్వం నేరుగా జమ చేసిందని సీఎం వెల్లడించారు.

ఒక్క కుటుంబమే రూ.7 లక్షల కోట్ల అప్పు చేసింది!

గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ఏర్పాటు నాటికి రాష్ట్ర ప్రజలపై కేవలం రూ.69 వేల కోట్ల అప్పు మాత్రమే ఉండేదన్నారు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుండి తాను సీఎంగా బాధ్యతలు చేపట్టే నాటికి ఆ అప్పును ఏకంగా రూ.8 లక్షల 11 వేల కోట్లకు చేర్చారని మండిపడ్డారు. అంటే ఒక్క కల్వకుంట్ల కుటుంబమే రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నిండా ముంచి, మన నెత్తిన మన్ను చల్లి వెళ్లిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బాధ్యతలు తీసుకున్నాక.. అసలు వివిధ శాఖలు, కార్పొరేషన్ల పేరుతో ఎన్ని రకాల అప్పులు ఉన్నాయో తేల్చాలని డిప్యూటీ సీఎం భట్టి గారిని కోరానని, తవ్వుతున్న కొద్దీ ఎక్కడికక్కడ చేసిన చేబదుళ్లు, కొత్త అప్పులు బయటపడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

బకాయిలు పెట్టింది బకాసురుడు.. కట్టే బాధ్యత నాది!

గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ అస్తవ్యస్తం చేసిందని సీఎం దుయ్యబట్టారు. “ఉద్యోగులకు జీతాలు సరిగా ఇవ్వకపోతే వారు పని చేసే పరిస్థితి ఉండదు. అందుకే ఒకటో తేదీనే జీతాలు పడేలా ఆర్‌బీఐ (RBI) తో మాట్లాడమని చెప్పి మరీ అమలు చేస్తున్నాం” అని రేవంత్ గుర్తుచేశారు. గత పాలకులు కేవలం జీతాలే కాకుండా సర్పంచ్‌లకు, కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా బకాయిలు పెట్టారని విమర్శించారు. “బకాయిలు పెట్టింది బకాసురుడు.. కానీ ఆ పాపం, వాటిని కట్టే బాధ్యత నా మీద పడింది” అని వ్యాఖ్యానించారు. ఈ బకాయిలపై మనోళ్లు కొందరు రేవంత్ ఇంటి ముందు ధర్నా చేస్తామంటున్నారని, ధర్నాకు వస్తే చాయ్ తాపి పంపిస్తానని సీఎం అన్నారు. రోగం దాస్తే ప్రాణాలకే ప్రమాదమని, అందుకే ఉన్నది ఉన్నట్లు ప్రజలకు నిజాలు చెప్తున్నానని స్పష్టం చేశారు. కేసీఆర్ అప్పులే కాదు, ఎన్నో తప్పులు కూడా చేశారని ఆరోపించారు.

రైతులకు రూ.36 వేల కోట్ల సాయం.. అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమా?

తమ ప్రభుత్వం సమాజంలో గౌరవం పెంచుకుంటూ వికాసం వైపు అడుగులు వేస్తోందని, రైతులకు అండగా నిలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే రూ.20,677 కోట్ల రైతు రుణమాఫీ చేశామని, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రైతు రాబందు (రైతు బంధు) పాత బకాయిలు రూ.7 వేల కోట్లను కూడా తామే చెల్లించామని చెప్పారు. వడ్ల పైసలు కూడా సకాలంలో వేసింది తామేనన్నారు. ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ.27 వేల కోట్లు వేశామని, ఇప్పుడు మరో రూ.9 వేల కోట్లు వేస్తున్నామని.. ఈ విధంగా మొత్తం రూ.36 వేల కోట్లు రైతులకు అందించామని లెక్కలు చెప్పారు.

రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎం స్పష్టం చేశారు. “ఏ సన్నాసి అయినా ఉచిత కరెంట్ మాది అంటే మా అక్కలు చీపురుకట్టలతో కొడతారు. వాళ్ల తీరు చూస్తుంటే గుడ్డు వచ్చి కోడిని ఎక్కిరించినట్లు ఉంది. చెట్టులెక్క పెరిగితే సరిపోదు, ఆవగింజంత గుజ్జు ఉండాలి” అంటూ బీఆర్ఎస్ నేతలపై పదునైన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రైతుల సంక్షేమంపై అసెంబ్లీలో చర్చ పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. “రాబోయే అసెంబ్లీ సమావేశాల చర్చకు కేసీఆర్ వస్తాడా?” అంటూ సవాల్ విసిరారు.