సింగరేణి గనుల్లో మరో ప్రమాదం జరిగింది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఇవాళ ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. పై కప్పు కూలిపోవడంతో.. బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే నలుగురు మరణించారు.. ఇక, ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీంతో సహాయక చర్యలు చేపట్టింది.. మొత్తం నలుగురు మృతదేహాలను బయటకు తీసింది…
ఈ ప్రమాదంలో గనిపై కప్పు 14 మీటర్ల పొడవు, 10 ఫీట్ల వెడల్పు, 15 ఫీట్ల మందంతో కూలిందని అధికారులు వెల్లడించారు.. కార్మికులు గని పై కప్పు సపోర్టు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిపారు.. మరోవైపు.. ప్రమాద స్థలాన్ని పలువురు అధికారులు, కార్మిక సంఘాల నేతలు సందర్శించారు.. ఇక, గని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందడంపై గుర్తింపు కార్మిక సంఘం, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రులు హరీష్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సింగరేణి సీ అండ్ ఎండీ ఎన్ శ్రీధర్.. ప్రమాద ఘటనపై తక్షణమే విచారణ జరిపి నివేదికనివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ అండగా ఉంటుందని తెలిపారు. కంపెనీ తరపున చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే వారి కుటుంబసభ్యులకు అందజేయాలని ఆదేశించారు. తోటి సింగరేణి కుటుంబ సభ్యులుగా వారికి యాజమాన్యం అండగా ఉంటుందని తెలిపారు. దీనిలో భాగంగా కార్మికుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ఏరియాలో ఉద్యోగం కల్పించనున్నామని ప్రకటించారు. మరోవైపు.. బాధిత కుటుంబాలను ఆదుకోవాలంటూ, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందంటూ కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి.. మొత్తంగా రెస్క్యూ టీమ్ శ్రమించి ఆ నలుగురు మృతదేహాలను బయటకు తీసి.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది.