NTV Telugu Site icon

MLC Kavitha:అది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా?

Kavitha

Kavitha

తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని మండి ప‌డ్డారు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బిజెపి నాయకులకు ఉన్నదా ? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా ? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా ? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా ? అని మండిపడ్డారు.

తెలంగాణ లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను , ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మరియు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారు ? అని నిప్పులు చెరిగారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారు , మంత్రి కేటీఆర్ గారు అనేకమార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగింది, ఎన్నో కుటుంబాలు ఆధార పడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు కవిత. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనక ఉన్న అర్థం ఏమిటని మండి పడ్డారు. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీని అడుగడుగునా ప్రశ్నించాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీ

ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీల‌కు నిర్దిష్ట‌మైన ఎజెండా ఉంద‌ని, రాహుల్ గాంధీ ఈ విష‌యాన్ని అర్థం చేసుకోవాల‌ని, ఎందుకంటే మ‌హారాష్ట్ర‌లో వాళ్లు అధికారంలో ఉన్నార‌ని, ప్రాంతీయ పార్టీ స‌పోర్ట్‌తోనే అక్క‌డ వాళ్లు అధికారంలో ఉన్న‌ట్లు ఎమ్మెల్సీ క‌విత తెలిపారు. మ‌హారాష్ట్ర‌లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారింద‌ని, రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుంద‌ని, ప్రాంతీయ పార్టీలే సార‌థ్య‌ బాధ్య‌త‌లు వ‌హిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయ‌ని ఎమ్మెల్సీ క‌విత పేర్కొన్నారు.

పార్టీలో ప్ర‌క్షాళ‌న చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ నిర్ణ‌యించింద‌ని.. దేశంలో నిరుద్యోగం పెరిగింద‌ని, మ‌త‌ప‌రమైన‌ స‌హ‌నం లోపించింద‌ని, ఈ నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీల విజ‌యంపై కాంగ్రెస్ అసూయ వ్య‌క్తం చేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. మెరుగైన పాల‌న‌ అందించాము కాబ‌ట్టే తాము స‌క్సెస్ అయిన‌ట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌హాలో త‌మ‌కు నాయ‌క‌త్వ సంక్షోభం లేద‌ని ఎమ్మెల్సీ క‌విత స్ప‌ష్టం చేశారు.

D. Imman: ద్వితీయ వివాహంపై వివరణ ఇచ్చిన సంగీత దర్శకుడు!