టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ పాల్గొన్నారు. ఇందులో భాగంగా జర్నలిస్ట్ స్వప్నతో కలిసి ఆయన మొక్కలు నాటారు. హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో తాము మొక్కలు నాటినట్లు ఆర్జీవీ సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. దీంతో ఆయన పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తనకు పచ్చదనం అంటే నచ్చదని, బురద అంటే అస్సలు గిట్టదని రామ్గోపాల్ వర్మ పేర్కొన్నారు. వర్మతో కలిసి మొక్కలు నాటిన ఫొటోలను జర్నలిస్ట్ స్వప్న ట్విట్టర్లో పంచుకోగా… ‘మై డిస్ప్లెజర్’ అంటూ వర్మ బదులిచ్చారు. మొత్తానికి వర్మ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాలుపంచుకున్నారు. కాగా తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. కరోనా సంక్షోభ సమయంలోనూ సెలబ్రిటీలు ఈ కార్యక్రమం పట్ల విశేషంగా స్పందించారు.
My displeasure https://t.co/tF0xuhlq6z
— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2022