MP Raghunandan Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడుతూ ఘాటుగా ప్రతి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలం తమ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, రేవంత్ రెడ్డికి చేతనైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, శాసనసభను రద్దు చేసి తక్షణమే ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. కావాలంటే కాంగ్రెస్కు ఉన్న ఎనిమిది మంది ఎంపీలను అలాగే ఉంచుకోవచ్చని, ప్రజా క్షేత్రంలో ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవికి తాము ఇస్తున్న గౌరవాన్ని, తమ సంస్కారాన్ని చేతకానితనంగా భావించవద్దని ఆయన హెచ్చరించారు.
రాజకీయంగా తాము కూడా అంతే ధీటుగా స్పందించగలమని స్పష్టం చేస్తూ, “కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు వడ్లు పోస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం సరికాదని, అలాగైతే తమకు కూడా కొడంగల్లో లేదా ప్రగతి భవన్ (మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్) ముందు వడ్లు పోయడం రాదా?” అని రఘునందన్ రావు నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కక్షసాధింపు చర్యలు, సవాళ్లు పక్కనపెట్టి రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కూటమి, కేంద్రంపై అనవసర విమర్శలు చేయడం ఆపి, దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజా తీర్పును కోరాలని ఆయన స్పష్టం చేశారు.

