తెలంగాణలో భారీ వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. అయితే.. తాజాగా ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మీడియాతో మాట్లాడుతూ.. వాయిదా పడ్డ ఈ సెట్, ఎంసెట్(అగ్రికల్చర్) తేదీలను త్వరలో ఖరారు చేస్తామని వెల్లడించారు. కనీసం వారం రోజులు ముందుగానే విద్యార్థులకు సమచారం ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ సారి డిగ్రీలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
కాకతీయ యూనివర్సిటీలో సోషియాలజీ (హానర్స్) పెడుతున్నామని, సిటీ కాలేజ్ లో హిస్టరీ (హానర్స్) సిరిసిల్లలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు, ఫారిన్ లాంగ్వేజెస్ కోర్స్ లను కూడా ప్రవేశ పెట్టామని ఆయన వెల్లడించారు. దోస్త్ లో ఈ రోజు వరకు 60 వేలు మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇంజనీరింగ్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుండి కొత్త ఫీజులు అమలులో కి వస్తాయని ఆయన తెలిపారు. విద్యార్థులు ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ వైపు కే మొగ్గు చూపుతున్నారన్నా లింబాద్రి.. విద్యార్థుల అంబిషన్ ను కాదనలేం కదా అంటూ వ్యాఖ్యానించారు.