NTV Telugu Site icon

టీఆర్ఎస్‌ ఖాతాలో మరో ఎమ్మెల్సీ.. వరంగల్‌ ఏకగ్రీవం..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వ‌రంగ‌ల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్‌ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు ఫలించాలయి.. నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ వరకు గడువు ఉన్నా.. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. టీఆర్ఎస్ ముఖ్య నేతలను రంగంలోకి దింపి నామినేషన్లు అన్నీ ఉపసంహరించుకునేలా పావులు కదిపారు.. ఇక, టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవం కావడం లాంఛనంగా మారిపోయింది.

Read Also: వైసీపీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీకి సిద్ధమైన సీఎం జగన్..

వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 14 నామినేషన్లు రాగా.. బుధవారం స్క్రూటిని అనంతరం 10 మంది అభ్యర్థులు నామినేషన్స్ తిరస్కరణకు గురయ్యాయి.. దీంతో నలుగురు బరిలో నిలిచారు.. టీఆర్ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు మంత్రి శ్రీశైలం, బానోతు రూప్‌సింగ్‌, పోతురాజు రాజు నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. ముగ్గురు స్వతంత్రులు బరిలో ఉండడంతో టీఆర్ఎస్ ముఖ్య నేతలను మంత్రి దయాకర్ రావు రంగం లోకి దింపారు. వారి తో చర్చలు జరిపి సమన్వయం చేయడంతో ఈ ముగ్గురు కూడా పోటీ నుండి తప్పుకున్నారు.. రేపటి వరకు విత్ డ్రాకి సమయం ఉన్న స్వతంత్రులుగా నామినేషన్ వేసిన ఆ ముగ్గురూ బరిలోనుంచి తప్పుకోవడంతో.. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం టీఆర్ఎస్‌ ఖాతాలో పడిపోయింది..

మరోవైపు.. తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి.. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పోరేటర్లు, కౌన్సిల‌ర్లకు, ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ప్రజాప్రతినిధుల‌కు ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునేందుకు సీఎం కేసీఆర్ కు ప్రజ‌లంతా అండ‌గా నిలిచారన్నారు. ప్రజ‌ల ఆకాంక్షల మేర‌కు కేసీఆర్‌ నాయ‌క‌త్వంలో తెలంగాణ రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే ఆద‌ర్శంగా నిలిచాయ‌ని అన్నారు. ఈ సంధ‌ర్భంగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డిని మంత్రి ద‌యాక‌ర్‌రావు అభినంద‌న‌లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు టీఆర్ఎస్‌ ఆరు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.