తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ధాన్యం కొనుగోళ్లపై మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. తాజాగా రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సేకరణ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తల తోక లేకుండా మాట్లాడ్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. తెలంగాణ రైస్ మిల్లులలో 94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని ఆయన తెలిపారు. నెల 15 రోజుల నుంచి తెలంగాణలో రైస్ మిల్లులు నడవడం లేదని, కేంద్రం వివిధ కారణాలతో బియ్యము తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.
ధాన్యం సేకరణ పై తెలంగాణ బీజేపీ నాయకులు తలో రకంగా మాట్లాడ్తున్నారని ఆయన విమర్శించారు. కేంద్రం వారం రోజుల్లో బియ్యం తీసుకోకపోతే తెలంగాణ బీజేపీ నాయకుల బట్టలు ఉడదీసి కొడతామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి అయితే పీయూష్ గోయల్ తో మాట్లాడాలని, తెలంగాణ బీజేపీ సంగతి రైతులు చూసుకుంటారంటూ ఆయన ధ్వజమెత్తారు.