అక్రమ నిర్మాణాలపై యాక్షన్ ప్లాన్ కొనసాగుతున్నది. గురువారం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక అపార్ట్ మెంట్ లో ఉన్న రెండు బ్లాక్ లపై అక్రమ అంతస్తుల నిర్మాణాలను డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం కూల్చి వేసింది. నిజాం పేట్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 92/పి లో ఒక యజమాని తనకు ఉన్న 840 చదరపు గజాల స్థలంలో గ్రౌండ్ + 2 అంతస్తుల భవనానికి అనుమతి తీసుకుని మూడు(3) బ్లాక్ లను స్లిట్ +5 అప్పర్ ఫ్లోర్స్ నిర్మాణాలు కట్టారు. దానిపై గురువారం టాస్క్ ఫోర్స్ టీమ్ చర్యలు తీసుకుంది. గత కొన్ని రోజులుగా హెచ్ఎండీఏ, టాస్క్ ఫోర్స్ టీమ్స్ పలు మున్సిపాలిటీల పరిధిలోని 600 చదరపు గజాలు పైబడిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, మరికొన్నింటిని సీజ్ చేయడం జరిగింది.
దీంతో ఇప్పటివరకు హెచ్ఎండీఏ టాస్క్ ఫోర్స్ టీమ్స్ 101 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసు ఉన్నది ఇందులో 78 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా మరో 23 అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని మున్సిపాలిటీలలో పనిచేస్తున్న సిబ్బంది కోవిడ్ కారణంగా విధులకు దూరంగా ఉన్న నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ చర్యలకు కొంత అంతరాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. అక్రమ కట్టడాలు నిర్మాణాల కూల్చివేత ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.