తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షునిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి నియామకం పట్ల ములుగు ఎమ్మెల్యే సీతక్క హర్షం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే విధంగా కలిసి పనిచేస్తారని సీతక్క ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఊరేగింపుగా వెళ్లిన సీతక్క వన దేవతలను దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షునితో పాటు అయిదుగురు కార్యనిర్వాహక అధ్యక్షులు, పదిమంది సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రచార కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీల నియామకానికి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ సీనియర్ నేతలతో వరుస సమావేశాలు చేస్తూ బిజీగా వున్నారు.