ఇప్పటివ వరకు 63.86 లక్షల మందికి రైతుబంధు అందజేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన చేశారు. రూ.6764.94 కోట్లు పంపిణీ చేసినట్లు.. ఇప్పటి వరకు కోటి 35 లక్షల ఎకరాలకు సాయం అందిందని ఆయన వెల్లడించారు. అయితే..రైతుబంధు నిధుల పంపిణీ ఇంకా కొనసాగుతుందని ఆయన తెలిపారు. దేశంలో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రశ్నలకు మోడీ సమాధానాలు చెప్పరా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రశ్నలతో బీజేపీలో ప్రకంపనలు వచ్చాయని, అన్నింటా విఫలమైన మోడీ ఏం చెప్పాలో తెలీక మీడియా ముఖం చూడడం లేదని విమర్శలు చేశారు.
ఎనిమిదేళ్లుగా ప్రధాని మీడియా ముందుకు ఎందుకు రావడం లేదని ఆయన అన్నారు. చేసిన అభివృద్ధి .. పెట్టిన పథకాల గురించి మాట్లాడమంటే .. అవి వదిలేసి బీజేపీ నేతలు అన్నీ మాట్లాడుతున్నారని ఆయన వెల్లడించారు. దేశాన్ని అన్ని రంగాలలో మోడీ వెనకబడేశారని ఆయన మండిపడ్డారు. అన్ని రకాల వస్తువులపై ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిచారని, మభ్యపెట్టే రాజకీయాలకు రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు సమాధానం చెప్తారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేళ్లలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని, తెలంగాణ మోడల్ దేశానికి అవసరమన్నారు నిరంజన్ రెడ్డి.