తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. అయితే, గులాబీ పార్టీ నేతలు మాత్రం రెండు పార్టీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే వున్నారు. సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బడుగుల అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులాంటి వ్యక్తి అని, ఆయన ముట్టుకుంటే భస్మం అవుతారని విమర్శించారు మంత్రి జగదీష్ రెడ్డి. కాళేశ్వరం కల సాకారం చేసిన నేత, సంక్షేమం, అభివృద్ధిలో సంచలనాలు సృష్టించిన నాయకుడు అన్నారు. పైరవీలు,దందాలు చేసినోళ్లే ఊర కుక్కల్లా మొరుగుతున్నారు.
కేసీఆర్ మీద ,కుటుంబం మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. 29 రాష్ట్రాలలో అతి చిన్న రాష్ట్రం. సంక్షేమం, అభివృద్ధిలో పరుగులు పెడుతున్న రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుంటే 24 గంటల విద్యుత్ ఉండేదా ? ఇంటింటికి మంచినీరు అందేదా?
దళారులకు దోచి పెట్టడం వారితో అంట కాగడం తప్ప బీజేపీ చేసిందేం లేదన్నారు.గుజరాత్ లో దారిద్ర్య రేఖ మరింత పెరిగింది.
మోడీ పాలనలో దళారులు కుబేరులైనారు.. దేశం దివాళా తీసింది. కాంగ్రెస్ పార్టీకి దిక్కు మొక్కు లేదు. పార్టీని నడిపే నాయకుడు ఎవరో వారికే తెలీదు. సొంత పార్టీకి నాయకుడు ఎవరో వారికే తెలియదు అటువంటి పార్టీలు పేలుతున్న పిచ్చి ప్రేలాపనలను ప్రజలు గమనిస్తున్నారు.మాదంతా పారదర్శకమే. మ్యానిఫెస్టోను ఉన్నది ఉన్నట్లు అమలు పరిచిన ఏకైక పార్టీ టి ఆర్ యస్. ఎక్కడ చర్చకైనా గులాబీ శ్రేణులు సిద్ధమే. డెబ్బయి ఏళ్లుగా జరగని అభివృద్ధి ఏడేళ్లలో 75శాతం పూర్తి అయింది. టి ఆర్ యస్ పార్టీ సంచలనాలకు కేంద్ర బిందువు. అటువంటి పార్టీలో సభ్యత్వం పొందడమే గౌరవం. నిబద్ధతే గుర్తింపు నిస్తుంది.ఆ నిబద్ధత తోటే బడుగులకు పదవులు వచ్చాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి.