Minister Harish Rao Launches Aspire Solutions At Hyderabad Gachibowli: ప్రపంచ పెట్టుబడులకు హైదరాబాద్ డెస్టినేషన్గా మారిందని, సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న విప్లవాత్మకమైన విధానాలే ఇందుకు కారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. గచ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేవల్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన ఆయన.. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద బహుళజాతి, ఐటీ సంస్థలు హైదరాబాద్లో తమ విస్తరణ కేంద్రాల్ని ఏర్పాటు చేశాయని తెలిపారు.
ఫ్లోరిడా, యూఎస్ఏ ఆధారిత సాంకేతిక సేవల సంస్థ అయిన ఫోనిక్స్ టెక్నాలజీస్.. హైదరాబాద్లో ఆస్పైర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని హరీశ్ రావు అన్నారు. తెలుగు విద్యార్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. మూడు సంవత్సరాల్లో మూడు వేల కంటే ఎక్కుమంది ఉద్యోగుల్ని కలిగి ఉండేలా ఈ సంస్థ విస్తరించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఆవిష్కరణల విషయంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించిందని గుర్తు చేశారు. ఆవిష్కరణల సూచీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు తొలి రెండు స్థానాల్లో ఉంటే.. గుజరాత్, బీహార్ రాష్ట్రాలు మాత్రం 14, 15 స్థానాల్లో ఉన్నాయన్నారు. తెలంగాణ కంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ రాష్ట్రాలు వెనుకబడ్డాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.