Minister Errabelli Dayakar Rao Funds Were Handed over to the Beneficiaries.
తెలంగాణ సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో లబ్దిదారులకు దళితబంధు నిధులు అందాయి. అయితే తాజాగా నేడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గంలోని జకొడకండ్ల, పెద్ద వంగర మండల కేంద్రాల్లో ఆయా మండలాల దళిత, పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో మంత్రి వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు ఎర్రబెల్లి దయాకర్ రావు. లబ్ధిదారులు లాభకరమైన యూనిట్లను ఎంపిక చేసుకోవాలని, లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ, లబ్ధిదారునికి సరైన అవగాహన కల్పించడం వంటి అంశాలపై అధికారులు శ్రద్ధ తీసుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే దిక్సూచి అన్నారు. ఇలాంటి పథకం దేశంలోనే ఎక్కడా లేదన్నారు. అంతేకాకుండా.. తెలంగాణలో ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. అందుకు కేంద్రం ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తున్నాయన్నారు. అధికారులు కూడా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని, దళితులు ఉన్నతస్థాయికి రావాలన్నదే కేసీఆర్ లక్ష్యమన్నారు.