న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేసినందుకు గానూ ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనంగా మారింది.
సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే, భూహక్కులకు సంబంధించి గతంలో ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు స్పందిస్తూ, వివాదంలో ఉన్న ఇరు పక్షాలకు నోటీసులు జారీ చేసి క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ను ఆదేశించింది. అయితే, న్యాయస్థానం నిర్దేశించిన గడువు ముగిసినప్పటికీ కలెక్టర్ ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని సదరు మహిళ మళ్లీ కోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ తన సమస్యను పట్టించుకోకపోవడమే కాకుండా, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారని ఆమె కోర్టు ధిక్కరణ (Contempt of Court) పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం, కలెక్టర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను అమలు చేయకపోవడం వ్యవస్థను అవమానించడమేనని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ అధికారులు చట్టానికి , న్యాయస్థానాలకు లోబడి పనిచేయాలని, ఆదేశాలను బేఖాతరు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. ఒక ఐఏఎస్ అధికారికి ఈ స్థాయిలో శిక్ష పడటంతో, ఇతర అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే, ఈ తీర్పుపై కలెక్టర్ రాహుల్ రాజ్ హైకోర్టు డివిజన్ బెంచ్లో అప్పీలు చేసే అవకాశం ఉంది.
Half-Day Schools: మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు
