పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వేదికగా శనివారం ఒక వింత సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఫిర్యాదు చేసి, మరోసారి ప్రముఖ సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఒక న్యాయవాదికి పోలీసులు అనూహ్యంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసే ఉద్దేశంతో న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అయితే, ఫిర్యాదు స్వీకరించే క్రమంలో ఆయన మద్యం సేవించి ఉన్నట్టు వాసన రావడంతో, అనుమానంతో
పోలీసులు అక్కడికక్కడే ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించారు.
Also Read:Dragon: తారక్ ‘బీస్ట్’ మోడ్.. నీల్ మామ మాస్టర్ ప్లాన్..మొదలైన ‘డ్రాగన్’ రచ్చ!
అయితే, పోలీసులు నిర్వహించిన బ్రీత్ అనలైజర్ పరీక్షలో రీడింగ్ 27గా నమోదైంది. సాధారణంగా నిర్ణీత పరిమితి లోపే ఈ రీడింగ్ ఉన్నప్పటికీ, ఆయన మద్యం తాగి స్టేషన్కు వచ్చారని పోలీసులు పేర్కొన్నారు. అయితే, తనకు టెస్టు నిర్వహించిన పోలీసుల తీరుపై న్యాయవాది సుబ్బారావు తీవ్రంగా మండిపడ్డారు. తనను అవమానించడానికే పోలీసులు ఇలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. “నేను రాత్రి మద్యం సేవించాను, ఆ ప్రభావం వల్ల రీడింగ్ వచ్చి ఉండవచ్చు. కానీ, ఒక సింగర్పై ఫిర్యాదు చేయడానికి వస్తే నాపై ఇలా ఆల్కహాల్ టెస్ట్ చేయడం వెనుక అసలు ఉద్దేశం కేసును పక్కదారి పట్టించడమే. నన్ను మానసికంగా వేధించి, కేసు డైవర్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు,” అని సుబ్బారావు వ్యాఖ్యానించారు.