ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం విచారణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ను వేధించడం అంటే సూర్యుడిపై ఉమ్మివేయడమేనని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ ఏ తప్పు చేయలేదు కాబట్టే, భయపడకుండా సిట్ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. “నిజానికి కేసీఆర్ గారి వయసు, ఆయన హోదా దృష్ట్యా నివాసం నుండే విచారణకు హాజరయ్యే వెసులుబాటు ఉంది. కోర్టును ఆశ్రయిస్తే ఈ విషయం తేలిపోయేది. కానీ, చట్టంపై ఉన్న గౌరవంతో ఆయన స్వయంగా వచ్చి 5 గంటల పాటు అధికారులకు సహకరించారు” అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విచారణతో అధికారులకు కూడా ఎలాంటి తప్పు జరగలేదని అర్థమై ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయం నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే ప్రభుత్వం ఈ విచారణను తెరపైకి తెచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా తెలంగాణకు బడ్జెట్లో దక్కింది ‘గుండు సున్నా’ అని ఎద్దేవా చేశారు.
రైతులు, మహిళలు, నిరుద్యోగులకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయలేక, ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ నడిబొడ్డున కాల్పులు జరుగుతున్నా, గంజాయి స్మగ్లర్ల దాడిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ మరణించినా ప్రభుత్వంలో చలనం లేదని ధ్వజమెత్తారు.
సమ్మక్క-సారక్క జాతరలో భక్తులకు కనీస ఏర్పాట్లు లేక మంత్రుల కార్లపై దాడులు జరుగుతున్నా, ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో విహరిస్తున్నారని విమర్శించారు. విచారణ పేరుతో ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ‘లీకులు’ ఇస్తోందని, అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా వ్యవహరిస్తోందని కేటీఆర్ అన్నారు. మీడియా కూడా ఇలాంటి తప్పుడు లీకులను నమ్మవద్దని కోరారు.