స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పురపాలికలు మేయర్లు,చైర్పర్సన్, కమిషనర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాలు, పల్లెల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి నెల ఎలాంటి ఆటంకం లేకుండా స్థానిక సంస్థలకు నిరాటంకంగా నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంమని పేర్కొన్నారు.
పట్టణ ప్రగతి కార్యక్రమ లక్ష్యాలను అందుకునే దిశగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతి లక్ష్యాలను పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తే తెలంగాణలోని ప్రతి పట్టణానికీ జాతీయస్థాయి గుర్తింపు తప్పకుండా వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇప్పటికే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, వాటిని అమలు చేసిన తెలంగాణ పురపాలికలకు జాతీయ స్థాయిలో అవార్డులు దక్కిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. పట్టణాల పురోగతి కోసం ప్రత్యేకంగా టీయూఎఫ్ ఐ డి సి అనే సంస్థను ఏర్పాటు చేసి పట్టణ ప్రగతి నిధులకు అదనంగా పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్నామన్నారు.
Read Also: రైతుల ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక నిధులతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలు వేగంగా చేయాలని, స్థానిక సంస్థల పరిధిలో ఉన్న పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల నిర్వహణ, గ్రీనరీ నిర్వహణ వంటి కార్యక్రమాలను పైన ఎక్కువ దృష్టి సారించాల్సిన బాధ్యతను పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. పురపాలన అంటేనే పౌర పాలన అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న కేటిఆర్ వారికి సూచించారు.
రానున్న ఆరు నెలలు లోపల సమీకృత శాకాహార, మాంసాహార మార్కెట్లను పూర్తి చేయాలని, వీటితోపాటు పెండింగ్ పనుల పూర్తి పైన దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక సంస్థల కోసం ప్రత్యేకంగా ఒక కలెక్టర్ స్థాయి అధికారిని నియమించిన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని,ప్రభుత్వ ఆలోచనలను అర్థం చేసుకుని చిత్తశుద్ధితో అధికారులు పనిచేయాలన్నారు. జిల్లాలోని స్థానిక సంస్థలకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు పట్టణాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. పురపాలనలో వినూత్నంగా ముందుకెళ్తున్న కరీంనగర్ లాంటి కార్పొరేషన్ తో పాటు ఇల్లందు లాంటి పురపాలికల అధికారులను ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.